భారత దిగ్గజ పారిశ్రామిక వేత్త, బిలియనీర్ గౌతమ్ అదానీకి సంబంధించిన కంపెనీ పేరు మారింది. అదానీ గ్రూప్లోని ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గ్రూప్-ఎఫ్ఎమ్సీజీ కంపెనీ అయిన అదానీ విల్మార్ పేరును.. ఆ సంస్థ మార్చేసింది. అయితే కంపెనీ పేరు మార్చేందుకు అదానీ గ్రూప్ కంపెనీలోని వాటాదారుల నుంచి అనుమతులు తీసుకున్నట్లు ఆ కంపెనీ తెలిపింది. అదానీ విల్మార్గా ఉన్న పేరును అదానీ అగ్రి బిజినెస్ లిమిటెడ్గా మార్చినట్లు ఆ కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ పేరు మార్చి.. రీ బ్రాండింగ్ చేయడం వెనక ఉన్న లక్ష్యం.. ఆ కంపెనీ గుర్తింపును, దాని ప్రధాన వ్యాపార కార్యకలాపాలు, వ్యవసాయ-వ్యాపార పరిశ్రమలో భవిష్యత్తును వృద్ధి అవకాశాలతో అనుసంధానించడమేనని అదానీ గ్రూప్ తెలిపింది.
అదానీ విల్మార్ కంపెనీ పేరును అదానీ అగ్రి బిజినెస్ లిమిటెడ్గా మార్చడం ద్వారా ఆ కంపెనీ వ్యవసాయం, ఆహార రంగంలో పనిచేస్తుందని తెలియజేయడం కోసమేనని పేర్కొంది. ఈ సందర్భంగా కంపెనీ పేరును మార్చడమే కాకుండా.. తన వ్యాపారాన్ని కూడా మరింత విస్తరించాలని ప్రణాళికలు ప్రారంభించినట్లు ఈ అదానీ అగ్రి బిజినెస్ లిమిటెడ్ కంపెనీ వెల్లడించింది. ఈ అదానీ అగ్రి బిజినెస్ లిమిటెడ్ కంపెనీ.. రానున్న రోజుల్లో ప్రతీ ఇంటి వంటగదిలో ఉపయోగించే ఆహార పదార్థాలను తయారు చేయడంపై దృష్టి సారిస్తుందని సదరు కంపెనీ వర్గాలు తెలిపాయి.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో తీసుకున్న ఆదాయపు పన్ను మినహాయింపుల్లో సంస్కరణలను దృష్టిలో ఉంచుకుని అదానీ గ్రూప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఆహార, వ్యవసాయ రంగంలోకి అదానీ కంపెనీ రావడం ద్వారా ఆహార డిమాండ్ను తీరుస్తుందని తెలుస్తోంది. దీంతో పాటు అదానీ అగ్రి బిజినెస్ లిమిటెడ్ తన రంగంలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టనుంది. ఇక ఈ పెట్టుబడుల కోసం 2022లో తీసుకువచ్చిన ఐపీఓ నుంచి వచ్చిన ఆదాయాన్ని ఉపయోగించనున్నారు.
అయితే గతంలోనే అదానీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ నిర్ణయం తీసుకున్నా.. ఆ తర్వాత వెనక్కి తగ్గింది. ఆహారం, ఎఫ్ఎమ్సీజీ వ్యాపారాన్ని అదానీ విల్మార్తో విలీనం చేసేందుకు చేసిన ప్రణాళికలను 2024 అక్టోబర్లో రద్దు చేసుకుంది. అదే సమయంలో 2023-24 ఆర్థిక సంవత్సరంలో అదానీ విల్మార్ వార్షిక ప్రాతిపదికన లాభం, నికర లాభంలో నష్టాలు వచ్చాయి. కానీ ఆ కంపెనీ 2024 రెండో త్రైమాసికంలో రూ.313 కోట్ల లాభాన్ని ఆర్జించింది. ఇప్పటివరకు ఇదే అతిపెద్ద లాభమని అదానీ అగ్రి బిజినెస్ లిమిటెడ్ వర్గాలు పేర్కొన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa