ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ రాష్ట్రంపైనే అదానీ, అంబానీ కన్ను

business |  Suryaa Desk  | Published : Tue, Feb 25, 2025, 11:24 PM

బిలియనీర్లు, భారత దిగ్గజ పారిశ్రామిక వేత్తలు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలు ఇప్పుడు అస్సాం రాష్ట్రంపై కన్నేశారు. అస్సాం రాష్ట్రంలో చెరో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం అస్సాం రాజధాని గువహటిలో జరుగుతున్న అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌లో భాగంగా అదానీ, అంబానీ.. ఈ ప్రకటనలు చేశారు. ఇక ఈ సదస్సు ద్వారా రాష్ట్రానికి 120 ట్రిలియన్ రూపాయల పెట్టుబడుల ప్రతిపాదనలను ఆహ్వానించాలని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ భావిస్తున్నారు. ఇక ఈ అడ్వాంటేజ్ అస్సాం 2.0 ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. మంగళవారం ప్రారంభించారు.


అస్సాం అభివృద్ధిని మరింత వేగవంతం చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని టెక్నాలాజికల్ పవర్‌హౌస్‌గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా.. అస్సాంలో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ వెల్లడించారు. 2018 ఇన్వెస్ట్‌మెంట్ ‌సమ్మిట్‌లో కూడా తాను అస్సాంలో రూ.5 వేల కోట్లు పెట్టుబడులు పెడతానని చెప్పారనని.. అయితే ఇప్పుడు అది రూ.12 వేల కోట్లు దాటిందని తెలిపారు. ఇక ఇది రానున్న 5 ఏళ్లలో ఎన్నో రెట్లు పెంచి.. రూ.50 వేల కోట్లు ఇన్వెస్ట్‌ చేస్తామని ముఖేష్ అంబానీ తెలిపారు. అస్సాం ఇప్పుడు భారతదేశ అభివృద్ధి పటంలో ఒక పక్క నుంచి మధ్యభాగానికి మారిందని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన "యాక్ట్ ఈస్ట్, యాక్ట్ ఫాస్ట్, యాక్ట్ ఫస్ట్" విధానాన్ని అంబానీ ప్రశంసించారు, అస్సాం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుందని.. ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలు.. అభివృద్ధి కేంద్రంగా అస్సాం వైపు చూడటం ప్రారంభిస్తాయని చెప్పారు.


ఇక అస్సాం యువత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ భవిష్యత్‌లో కీలక పాత్ర పోషిస్తారని అంబానీ అంచనా వేశారు. అస్సాంలో పండే టీ ప్రజాదరణ పొందడం కారణంగా.. ఇప్పటివరకు అస్సాం టీకి స్వర్గధామంగా పిలువబడుతోందని చెప్పిన అంబానీ.. భవిష్యత్‌లో ప్రపంచానికి టెక్నాలజీ స్వర్గధామంగా అస్సాం ప్రసిద్ధి చెందుతుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు అస్సాం యువత కొత్త అర్థాన్ని ఇస్తారని.. AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాత్రమే కాకుండా అస్సాం ఇంటెలిజెన్స్‌గా అభివర్ణించారు.


మరోవైపు.. మరో బిలియనీర్ అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కూడా అస్సాంలో వివిధ రంగాల్లో రూ.50 వేల కోట్ల పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చారు. ఎయిర్‌పోర్టులు, ఏరో సిటీలు, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, ట్రాన్స్‌మిషన్స్, సిమెంట్, రోడ్డు ప్రాజెక్టుల కోసం అస్సాంలో రూ.50 వేల కోట్లు పెట్టుబడులకు సిద్ధం ఉన్నట్లు గర్వంగా చెబుతున్నట్లు అదానీ పేర్కొన్నారు. దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చడంలో ఇలాంటి సదస్సులు కీలకమని పేర్కొన్న అదానీ.. ఇలాంటి సదస్సులతో వికసిత్ భారత్‌ను మరింత బలోపేతం చేస్తాయని అదానీ తెలిపారు. సోమవారం రోజున మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ సందర్భంగా ఆ రాష్ట్రంలో 1.1 ట్రిలియన్ రూపాయల పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించారు. గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీ, విమానాశ్రయ ప్రాజెక్ట్, బొగ్గు గ్యాసిఫికేషన్ సహా వివిధ రంగాల్లో లక్ష మందికిపైగా ఉద్యోగాలు కల్పించనున్నట్లు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa