ప్రాణం పోసే వైద్యుడి కంటే కూడా ప్రాణాలు నిలిపే డాక్టర్కే ఎక్కువ విలువ ఇస్తుంటాం. మన ప్రాణాల మీదకు వచ్చినప్పుడు ఏం చేసైనా సరే మమ్మల్ని కాపాడమంటూ కాళ్లావేళ్లా పడుతుంటాం. ఇలాంటి పవిత్రమైన వృత్తిలో ఉన్న ఓ డాక్టర్ విచక్షణా రహితంగా వ్యవహరించాడు. కామంతో కళ్లు మూసుకుపోవడంతో.. తన వద్దకు వచ్చేది రోగులు అని కూడా చూడకుండా వారిపై అత్యాచారాలకు పాల్పడ్డాడు. అందులో ఆడా, మగా అనే తేడా లేకపోగా.. చిన్న పిల్లలనే కనికరం కూడా చూపలేదు. 30 ఏళ్ల సర్వీసులో మొత్తంగా 299 మంది జీవితాలను నాశనం చేశాడు. మరి ఇంత దారుణానికి ఒడిగట్టిన ఆ డాక్టర్ ఎవరు, ఇప్పుడు అతను ఎక్కడ ఉంటున్నాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్రాన్స్లోని బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల జోయల్ లి స్కార్నెక్ సర్జన్గా పని చేసేవాడు. అయితే అనేక అనారోగ్య సమస్యలతో తన వద్దకు వచ్చిన రోగులకు.. ఆపరేషన్లు కూడా చేసేవాడు. ఈక్రమంలోనే ముందుగా మత్తు మందు ఇచ్చి.. ఆపై వారికి తెలియకుండానే అత్యాచారాలకు పాల్పడేవాడు. ఆ తర్వాత శస్త్ర చికిత్స చేసి వారికి ఏమీ తెలియకుండా చూసుకునేవాడు. కానీ 2017లో ఆయన పక్కింట్లో ఉన్న ఓ ఆరేళ్ల చిన్నారితో అసభ్యంగా ప్రవర్తిస్తూ దొరికిపోయాడు. దీంతో బాలిక కుటుంబ సభ్యులు జోయెల్పై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదు చేశారు. ఈక్రమంలోనే నిందితుడి ఇంటికి వెళ్లి పోలీసులు సోదాలు చేశారు. అక్కడే వారికి గట్టి షాక్ తగిలింది.
ముఖ్యంగా 3 లక్షలకు పైగా అశ్లీల ఫొటోలు ఆయన ఇంట్లో దొరకగా.. తలలు పట్టుకున్నారు. ఆపై మరింత వెతకగా 650కి పైగా అశ్లీల వీడియోలు కూడా కనిపించాయి. అలాగే అతడికి సంబంధించిన ఓ డైరీ సైతం దొరకగా.. ఓ పోలీసు అధికారి దాన్ని చదివాడు. అందులో జోయెల్.. చిన్న పిలల్లు, జంతువులను చూడగానే తనకు ఆకర్షణ మొదలవుతుందని.. వారిని అనుభవించేవరకు తనకు ఆందోళన తప్పదంటూ రాసుకొచ్చాడు. అంతేకాకుండా తన జీవితంలో అనేక మందిపై అత్యాచారాలు జరిపానని వివరిస్తూనే.. వారి పేర్లను కూడా రాసుకొచ్చాడు. అవన్నీ చూసిన పోలీసులు అతడికి మతిస్థిమితం సరిగ్గా లేదేమోనని భావించారు.
కానీ ఈ ఘటన జరిగిన తర్వాత జోయెల్ మరికొంత మంది పిల్లలపై కూడా అత్యాచారాలు జరిపినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు 2020లో అతడిని మరోసారి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. ఈక్రమంలోనే న్యాయస్థానం అతడిని దోషిగా తేలుస్తూ.. 15 ఏళ్ల జైలుశిక్ష విధించింది. అలాగే పోలీసులకు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాలని సూచించింది. దీంతో పోలీసులు జోయెల్ గురించి దర్యాప్తు చేయగా.. అనేక కేసులు వెలుగులోకి వచ్చాయి. అప్పుడే వారికి జోయెల్ డైరీలో రాసుకున్నది నిజమేనని.. వారందరిపై అతడు అత్యాచారాలు చేసినట్లు గుర్తించారు. అందులో ఉన్న వారందరినీ సంప్రదించగా.. పలువురికి తమపై లైంగిక దాడి జరిగిన విషయం కూడా తెలియదన్నారు. మత్తులో ఉండడం వల్లే గుర్తించలేకోపయామని కన్నీళ్లు పెట్టారు.
జోయెల్ కూడా తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. 1989 నుంచి 2014 మధ్య మొత్తంగా 158 మంది అబ్బాయిలు, 141 మంది అమ్మాయిలపై అత్యాచారానికి పాల్పడినట్లు వివరించాడు. వీరిలో ఎక్కువ మంది చిన్న పిల్లలు కూడా ఉన్నారని అంగీకరించాడు. తాను చాలా క్రూరమైన పనులు చేశానని.. పిల్లలు మానసికంగా గాయపడతారని తెలిసినా తాని తప్పు చేసినట్లు స్పష్టం చేశాడు. ప్రస్తుతం ఈ కేసుపై విచారణ కొనసాగుతోంది. మరి ఇతడు దోషిగా తేలితే న్యాయస్థానం ఎలాంటి శిక్ష వేస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa