ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆడుతూనే టెస్టు ప్రాక్టీస్ చేయండీ.. బీసీసీఐ కొత్త ప్రతిపాదన

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 26, 2025, 11:11 PM

టీమిండియా ప్లేయర్లపై బీసీసీఐ కొంత కాలంగా కాస్తంత కఠినంగానే వ్యవహరిస్తోంది. సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా ఎవ్వరైనా బీసీసీఐ రూల్స్ పాటించాల్సిందేనని తెగేసి చెప్పింది. గౌతమ్ గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇవి మరీ ఎక్కువయ్యాయి. సిరీస్ ఏదైనా విజయం టీమిండియాదే అయ్యుండాలనేది గంభీర్ భావన. అందుకే టీమిండియా ప్లేయర్ల డిసిప్లేన్ విషయంలో బీసీసీఐ గట్టిగానే వ్యవహరిస్తోంది.


వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ప్రారంభం అయినప్పటి నుంచి టీమిండియా వరుసగా ఫైనల్స్‌కు చేరుకుంది. 2021, 2023లో ఫైనల్స్‌కు వెళ్లినప్పటికీ న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై ఓటమిపాలయింది. బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో 1-3 తేడాతో ఓటమిపాలవడంతో ఈ ఏడాడి కనీసం అర్హత కూడా సాధించలేకపోయింది. అప్పటి నుంచి బీసీసీఐ రూల్స్ కఠినతరం చేసింది. టీమిండియాకు చెందిన ప్రతీ ఆటగాడూ రంజీల్లో ఆడతీరాల్సిందేనని రూల్ పెట్టింది. దాంతో దశాబ్దాల తర్వాత రోహిత్, విరాట్ కోహ్లి రంజీలు ఆడాల్సి వచ్చింది.


ఇప్పుడు తాజాగా టీమిండియా ప్లేయర్ల ముందు బీసీసీఐ ఓ కొత్త ప్రతిపాదన ఉంచింది. ఐపీఎల్ ఆడే సమయంలోనే టీమిండియా క్రికెటర్లతో టెస్టు కూడా ప్రాక్టీస్ చేయించాలని చూస్తోంది. మార్చి 9న ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన వెంటనే మార్చి 22 నుంచి ఐపీఎల్ 2025 ప్రారంభం కానుంది. మే 25 వరకు అంటే రెండు నెలల పాటు ఐపీఎల్ సాగనుంది. ఆ తర్వాత జూన్‌లో టెస్టు సిరీస్‌కు టీమిండియా ఇంగ్లండ్‌కు వెళ్లనుంది.


ఐపీఎల్ మ్యాచ్‌లు జరుగుతున్న సమయంలో టీమిండియా టెస్టు క్రికెటర్లతో రెడ్ బాల్‌తో కూడా ప్రాక్టీస్ చేయించాలనే ఆలోచనలో బీసీసీఐ ఉంది. ఒకవైపు ఐపీఎల్ ఆడుతూనే మరోవైపు టెస్టు క్రికెట్ కూడా ప్రాక్టీస్ చేయించాలనేది బీసీసీఐ ఉద్దేశం. జూన్ నుంచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌‌షిప్ ప్రారంభం కానుండటంతో ఇంగ్లండ్ సిరీస్ టీమిండియాకు చాలా కీలకం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని బీసీసీఐ వర్గాలు చెబుతున్నాయి.


ఐపీఎల్ ముగిసిన వెంటనే ఇంగ్లండ్ కౌంటీ మ్యాచ్‌లు ఆడాలని కొందరు టీమిండియా క్రికెటర్లు నిర్ణయించుకున్నారు. ముఖ్యంగా విరాట్ కోహ్లి ఇంగ్లండ్ కౌంటీలు ఆడాలని డిసైడ్ అయ్యాడు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా మీద వరుస సిరీస్‌లలో టీమిండియా ఓడిపోవడంతోనే బీసీసీఐ ఈ నూతన ప్రతిపాదన తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa