భారత రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్ కీలక ప్రకటన చేసింది. ఉద్యోగులకు వేతన సవరణ పత్రాలు (శాలరీ రివిజన్ లెటర్స్) అందించడం ప్రారంభించింది. మంగళవారం నుంచి ఇంక్రిమెంట్ లెటర్స్ ఇస్తున్నట్లు ఈ వ్యవహారం గురించి తెలిసిన వ్యక్తులు వెల్లడించారు. ఉద్యోగులకు ఈ వేతనాల పెంపు సగటున ఇప్పుడు 5 నుంచి 8 శాతం వరకు ఉన్నట్లు తెలిసింది. ఇది వారి వారి పెర్ఫామెన్స్ రేటింగ్ను బట్టి అమలు చేసింది. అయితే.. చిన్న సంఖ్యలో ఉన్న అత్యద్భుత పెర్ఫామెన్స్ చేసిన ఉద్యోగులకు మాత్రం డబుల్ డిజిట్ ఇంక్రీజ్ అందినట్లు సమాచారం. వేతనాల పెంపు కోసం ఇన్ఫోసిస్.. మెట్ ఎక్స్పెక్టేషన్స్ (అంచనాల్ని అందుకోవడం), కమెండబుల్ పెర్ఫామెన్స్ (ప్రశంసనీయం), అవుట్స్టాండింగ్ పెర్ఫామెన్స్ (అత్యుత్తమ పనితీరు), నీడ్స్ ఇంప్రూవ్మెంట్ (ఇంకా మెరుగుపడాలి) వంటివి ప్రాతిపదికగా తీసుకుంది.
ఇందులో మెట్ ఎక్స్పెక్టేషన్స్ ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం వరకు వేతనాల్ని పెంచింది. ఇదే సమయంలో కమెండబుల్ పెర్ఫామర్లకు సగటున 7 నుంచి 10 శాతం వరకు వేతనాల పెంపు కనిపించింది. ఇక అవుట్స్టాండింగ్ పెర్ఫామర్లకు మాత్రం ఏకంగా 10 నుంచి 20 శాతం వరకు వేతనాలు పెరిగాయి. నీడ్స్ ఇంప్రూవ్మెంట్ కేటగిరీ ఉద్యోగులకు మాత్రం ఎలాంటి పెంపు లేదని తెలిసింది.
ఉద్యోగులకు ఈ వేతనాల పెంపు లెవెల్ 5 ఉద్యోగులు (టీమ్ లీడర్స్ స్థాయి వరకు) సహా లెవెల్ 6 (మేనేజర్స్ బిలో వైస్ ప్రెసిడెంట్స్ స్థాయి వరకు) ఉద్యోగులకు కూడా వర్తిస్తుందని తెలిపింది. ఇక్కడ లెవెల్ 5 (JL5) ఉద్యోగులకు వేతనాల పెంపు జనవరి 1 నుంచే అమల్లోకి వచ్చింది. అంటే గత బకాయిలతో కలిపి వస్తుందన్నమాట. JL6 వారికి ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. అయితే ఇప్పుడు వేతనాల పెంపు.. చివరగా కంపెనీ 2023 నవంబర్ నెలలో అందించిన పెంపు కంటే 5-10 శాతం తక్కువగా ఉండటం గమనార్హం. ఇంకా గత వారం ప్రకటించిన పెర్ఫామెన్స్ బోనస్ పేఅవుట్ (వేరియబుల్ పే) కూడా చాలా తగ్గించింది.
బెంగళూరు ప్రధాన కేంద్రంగా పనిచేసే ఈ ఐటీ కంపెనీలో మొత్తం 3.23 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. వేతన పెంపు కోసం 2023 సెప్టెంబర్ నుంచి 2024 అక్టోబర్ వరకు కాలాన్ని పరిగణనలోకి తీసుకుంది. ఇక వీరు 2024 డిసెంబర్ నెలలోనే రేటింగ్ లెటర్స్ అందుకున్నారు. ఇక ఇప్పుడు బకాయిలతో కలిపి వేతనాల్ని పెంచింది. ఇక ఇన్ఫీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 15 వేల మంది ఫ్రెషర్లను నియమించుకునే ప్రక్రియ కొనసాగుతుండగా.. వచ్చే ఆర్థిక సంవత్సరంలో దాదాపు 20 వేల మందిని నియమించుకోవాలని ప్లాన్ చేస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa