టెక్నాలజీ ఎంత డెవలప్ అయితే అంత ఉపయోగాలు ఉంటాయి. అయితే అదే స్థాయిలో ప్రతికూలతలు కూడా ఉంటాయి అనేది కొన్ని వర్గాలు చెప్పే మాట. ఇక ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, రోబోలను డెవలప్ చేయడానికి అనేక పరిశోధనలు, ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే మనిషి ఇలా టెక్నాలజీపై, యంత్రాలపై అధికంగా ఆధారపడి.. మానవజాతి అంతానికి నాంది పలుకుతున్నాడనే వాదనలు వినిపిస్తూనే ఉన్నాయి. అచ్చం వాటన్నింటి ఆధారంగానే రజినీకాంత్ హీరోగా గతంలో రోబో అనే సినిమా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాలో మంచి కోసం రజినీకాంత్.. అచ్చం తన రూపంలో ఉండే ఒక హ్యూమనాయిడ్ రోబోను తయారు చేస్తారు. ఆ రోబో మంచి పనులు చేస్తుంది. కానీ విలన్ అందులోని సాఫ్ట్వేర్లో మార్పులు చేయడంతో.. మనిషి లాగా ఉన్న ఆ రోబో.. ఒక్కసారిగా నరరూప రాక్షసుడిగా మారిపోయి.. మనుషుల ప్రాణాలు తీస్తుంది.
ఈ క్రమంలోనే తాజాగా జరిగిన ఓ సంఘటన మళ్లీ అలాంటి ఘటనను గుర్తు చేసింది. చైనాలో ఏర్పాటు చేసిన ఓ రోబో ఎగ్జిబిషన్లో ఆర్టిఫిషియల్ రోబో.. అక్కడికి వచ్చిన సందర్శకులను తీవ్ర భయకంపితులను చేసింది. ఆ ఎగ్జిబిషన్కు వచ్చిన వారిపైకి ఒక్కసారిగా దూసుకెళ్లి దాడి చేయబోయింది. దీంతో అక్కడ ఉన్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. వెంటనే అది గమనించిన అక్కడ ఉన్న భద్రతా సిబ్బంది.. ఆ రోబోను అడ్డుకోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో.. రోబోలు, టెక్నాలజీ విషయంలో ఉన్న భయాందోళనలు మరోసారి చర్చనీయాంశంగా మారాయి.
ఇక ఆ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండటంతో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మానవ జాతి అంతానికి ఆర్టిఫీషియల్ ఇంటెలిజన్స్ ఒక మొదటి అడుగులాగా అనిపిస్తోందని పేర్కొంటున్నారు. ఇవి రోబోలు కావని.. మనుషుల ప్రాణాలు తీసే జాలి, దయ లేని క్రూరమైన యంత్రాలు అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. ఇక ఇలాంటివి చూస్తుంటే.. భవిష్యత్తుపై తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతోందని పేర్కొంటున్నారు.
ఈశాన్య చైనాలో ఫిబ్రవరి 9వ తేదీన రోబో ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ ఎగ్జిబిషన్లో యూనిట్రీ రోబోటిక్స్ కంపెనీకి చెందిన ఒక హ్యూమనాయిడ్ రోబోను కూడా తీసుకువచ్చారు. అయితే ఈ హ్యూమనాయిడ్ రోబో మనుషుల కదలికల గుర్తించి.. వాటికి అనుగుణంగా స్పందిస్తుంది. అంతేకాకుండా కొన్ని మాటలు కూడా మాట్లాడుతుంది. ఈ క్రమంలోనే ఆ హ్యూమనాయిడ్ ఏఐ రోబో.. ఒక్కసారిగా సందర్శకులపైకి దూసుకురావడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఈ ఘటనపై రోబో ఎగ్జిబిషన్ నిర్వాహకులు స్పందించారు. రోబోలో ఏర్పడిన సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన సంభవించిందని చెప్పారు. అయితే పూర్తిగా అన్ని పరీక్షలు చేయకుండానే.. హ్యూమనాయిడ్ రోబోను ఎగ్జిబిషన్కు ఎందుకు తీసుకువచ్చారంటూ సందర్శకులు ప్రశ్నించారు. ఎగ్జిబిషన్కు తీసుకువచ్చిన రోబోలకు సరైన భద్రతా పరీక్షలు చేయలేదంటూ ఆరోపించారు. సాఫ్ట్వేర్ బగ్ కారణం ఒకటే కాదని.. అందులో ఇంకా చాలా తప్పిదాలు ఉన్నాయని కొందరు టెక్నికల్ ఎక్స్పర్ట్స్ అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa