ఛాంపియన్స్ ట్రోఫీ గ్రూప్ స్టేజ్లో టీమిండియా మార్చి 2న కివీస్తో నామమాత్రపు మ్యాచ్ ఆడనుంది. ఇప్పటికే భారత్, న్యూజిలాండ్ జట్లు సెమీ ఫైనల్స్కు చేరుకున్నాయి. ఈ మ్యాచ్కి టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ దూరమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒకవేళ రోహిత్ దూరమైతే కెప్టెన్గా గిల్ బాధ్యతలు తీసుకోనుండగా.. జట్టులోకి రిషబ్ పంత్ వచ్చే ఛాన్స్ ఉంది.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ గాయంతో ఇబ్బంది పడుతున్నాడు. పాకిస్తాన్తో మ్యాచ్ సమయంలో ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు రోహిత్ గాయపడ్డాడు. పాకిస్తాన్ బ్యాటర్ బాదిన బంతిని పట్టుకునే సమయంలో బౌండరీ వద్దకు పరిగెత్తిన రోహిత్ తొడ కండరాల నొప్పితో ఇబ్బంది పడ్డాడు. మ్యాచ్ 26వ ఓవర్లో గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లి కొద్ది ఓవర్ల తర్వాత మళ్లీ వచ్చాడు. బ్యాటింగ్ చేసే సమయంలోనూ బౌండరీలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు.
న్యూజిలాండ్తో మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా క్రికెటర్లు ప్రాక్టీస్ మొదలుపెట్టారు. ప్రాక్టీస్ సెషన్లో రోహిత్ ఎక్కడా కనిపించలేదు. కనీసం గ్రౌండ్లో క్యాచ్లు కూడా ప్రాక్టీస్ చేయలేదు. దాంతో రోహిత్ శర్మ న్యూజిలాండ్తో మ్యాచ్కి దూరంగా ఉండబోతున్నట్లు క్రికెట్ వర్గాలు చెప్పాయి. రోహిత్ శర్మ రెస్ట్ తీసుకుంటే వైస్ కెప్టెన్గా ఉన్న శుభమన్ గిల్ కెప్టెన్సీగా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు.
రోహిత్ శర్మ దూరమైతే ఓపెనర్గా స్టాండ్ బైలో మరొక ప్లేయర్ లేడు. యశస్వి జైస్వాల్ను తప్పించి అతని స్థానంలో వరుణ్ చక్రవర్తిని టీమిండియా స్క్వాడ్లో తీసుకున్నారు. న్యూజిలాండ్తో మ్యాచ్లో రోహిత్ శర్మ ప్లేస్లో ఓపెనర్గా కేఎల్ రాహుల్ వచ్చే అవకాశం ఉంది. అలాంటప్పుడు కీపర్గా రిషబ్ పంత్ను ప్లేయింగ్ 11లో ఆడేంచే ఛాన్స్ ఉంది.
కివీస్పై నామమాత్రపు మ్యాచ్ అయినా దాని ఫలితం ఆధారంగానే సెమీస్లో ఎవరితో తలపడాలి అనేది ఉంటుంది. గ్రూప్ ఏలోని భారత్, న్యూజిలాండ్ జట్లలో ఏది టాప్ ప్లేస్లో ఉంటుందో కూడా మార్చి 2న జరిగే మ్యాచే నిర్థారించనుంది. దాంతో ఈ మ్యాచ్ కూడా ఇరుజట్లకి కీలకంగా మారనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa