నవ్యాంధ్ర కలల రాజధాని అమరావతికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసింది. రాజధాని అభివృద్ధి కోసం కిందటి బడ్జెట్లో కేటాయించిన నిధుల కంటే ఈ బడ్జెట్లో రెట్టింపు కేటాయించింది. రాజధానిపై కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధిని మరోమారు ప్రకటించింది. గత ఐదేళ్లుగా వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై బడ్జెట్లో ప్రస్తావనకు కూడా నోచుకోని రాజధాని అమరావతి, కూటమి ప్రభుత్వ బడ్జెట్లలో అగ్రతాంబూలం అందుకుంది. కిందటి బడ్జెట్లో రూ.3వేల కోట్లు కేటాయించగా ఈసారి అమరావతి కేపిటల్ సిటీ డెవలప్మెంట్ ప్రాజెక్టుల కింద ఆ మొత్తాన్ని రూ.6 వేల కోట్లకు పెంచింది. ఇప్పటికే ఐకానిక్ టవర్స్గా ఉన్న సచివాలయ భవన సముదాయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాల నిర్మాణ పనులు జోరందుకోనున్నాయి. ఇప్పటికే ఆ పనులకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ తుది దశకు చేరింది. అన్నీ సకాలంలో జరిగితే మార్చి 15 నుంచి రాజధాని నిర్మాణ పనులు మరింత జోరందుకోనున్నాయి. 2014- 19ల మధ్య ప్రాధాన్యతను సంతరించుకున్న మెట్రో రైలు ప్రాజెక్టు వైసీపీ హయాంలో ప్రస్తావనకు కూడా నోచుకోలేదు. తాజా బడ్జెట్లో భారీ కేటాయింపుల నేపథ్యంలో మెట్రో ఆశలకు రెక్కలు వచ్చాయి. అమరావతి నిర్మాణంలో కీలకమైన భూ సమీకరణకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. తాజాగా రాజధాని పరిధిలోని కీలక రహదారులను జాతీయ రహదారి ఎన్హెచ్- 16కు అనుసంధానించే ప్రక్రియ తెరమీదకి వచ్చింది. కరకట్ట రహదారి విస్తరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భూసమీకరణ జరగాల్సి ఉంది. అలాగే గతంలో కొన్ని గ్రామాల్లో రైతులు రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. ఇప్పుడు వారంతా భూములు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. ఇలా భూసమీకరణ అవసరాల నిమిత్తం తాజాగా బడ్జెట్లో మరో 297.82 కోట్లు కేటాయించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa