ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 వ్యవసాయ బడ్జెట్లో, ఆంధ్రప్రదేశ్లో సహజ వ్యవసాయ పద్ధతులను (ప్రకృతి వ్యవసాయం) ప్రోత్సహించడానికి రూ.61 కోట్లు కేటాయించింది. రాష్ట్రంలో పర్యావరణ అనుకూల వ్యవసాయ పద్ధతుల్ని రైతులు పాటించేలా చెయ్యడం దీని ముఖ్య ఉద్దేశం. రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేందుకు ప్రభుత్వం వ్యవసాయ యంత్రాలకు సబ్సిడీ ఇస్తోంది. ఇందుకోసం బడ్జెట్లో రూ.139 కోట్లు కేటాయించింది. అలాగే.. ఎరువుల్ని కూడా సబ్సిడీకి ఇవ్వనుంది. ఇందుకోసం రూ.40 కోట్లు కేటాయించింది. కేంద్ర ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయాన్ని పెంచేందుకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి రూ.616 కోట్లు కేటాయించింది. ఆ రూ.616 కోట్లలో కొంత ఏపీకి ఇవ్వనుంది. ఈ జాతీయ మిషన్ ద్వారా కేంద్రం.. వచ్చే 2 సంవత్సరాల్లో 1 కోటి మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేసేలా చెయ్యాలని కేంద్రం ప్లాన్ చేసింది. దీన్ని ఏపీ ప్రభుత్వం బలంగా అమలు చేస్తోంది. వ్యవసాయంలో రసాయనాల వాడకం తగ్గించడం, పురుగు మందుల వాడకం తగ్గించడం ప్రకృతి వ్యవసాయం ముఖ్య లక్ష్యం. అలాగే ప్రభుత్వం నేల సారాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటోంది. సూక్ష్మపోషకాల్ని సబ్సిడీపై అందిస్తోంది.ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ (APCNF) సంస్థ ఏపీలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా 2024 నాటికి 80 లక్షల హెక్టార్లలో 60 లక్షల మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా ఏపీలో 2,570 క్లస్టర్లను ఏర్పాటుచేశారు. ప్రతి క్లస్టర్.. చాలా గ్రామాలను కలిగి ఉంటుంది. ప్రతీ క్లస్టర్ నుంచి రైతులకు ట్రైనింగ్ ఇస్తారు. అలాగే ప్రకృతి వ్యవసాయం చెయ్యడానికి రైతులకు ఏమేం కావాలో వాటిని సబ్సిడీతో ఇస్తారు. APCNF సంస్థ బాగానే పనిచేస్తోంది. 2016లో 40,000 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యగా.. 2024 నాటికి 10 లక్షల మంది రైతులు ఈ వ్యవసాయం చేస్తున్నారు. 5,00,000 హెక్టార్లలో ఈ సాగు జరుగుతోంది. ఇప్పుడు 2027 నాటికి 100 శాతం సహజ వ్యవసాయం చేసే రాష్ట్రంగా ఏపీని మార్చాలనే టార్గెట్ ఉంది.తాజాగా ఏపీ ప్రభుత్వం వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి.. ఏపీలోని ప్రతీ మండలంలోని కనీసం ఒక గ్రామం అయినా 100 శాతం ప్రకృతి వ్యవసాయం చేయించేలా ప్లాన్ చేసింది. ఈ దిశగా గ్రామాల్లో వ్యవసాయ అధికారులు సర్వే చేస్తున్నారు. ఈ సర్వేలో రైతులతో మాట్లాడి.. ప్రకృతి వ్యవసాయం చేసేలా ఒప్పిస్తారు. ఆ తర్వాత ఆ వ్యవసాయం ఎలా చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తారు. ప్రకృతి వ్యవసాయంలో రైతులు.. స్థానికంగా లభించే దినుసులతో.. కషాయాలు, జీవ ఘన ఎరువుల్ని తయారుచెయ్యగలరు. ఎలా చెయ్యాలో ట్రైనింగ్ ఇస్తారు. ఈ ట్రైనింగ్లో డ్వాక్రా మహిళలు కూడా పాల్గొంటారు. ప్రకృతి వ్యవసాయం కోసం రైతులకు చాలా ప్రయోజనాల్ని ప్రభత్వం కల్పిస్తోంది. అంటే.. వ్యవసాయ యంత్రాలు, సూక్ష్మపోషకాలు, ఇతరత్రా ఏమేం కావాలో వాటిని సబ్సిడీ ధరలకు ఇస్తోంది. అందువల్ల రైతులు ఈ వ్యవసాయం చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీని వల్ల వారి నిర్వహణ, వ్యవసాయ ఖర్చులు చాలా వరకు తగ్గిపోతున్నాయి. దిగుబడి కూడా బాగానే ఉంటోంది. ఖర్చులు తగ్గడం వల్ల.. ఇదివరకటి కంటే ఎక్కువ లాభాలు పొందేందుకు వీలవుతోంది. అందుకే ప్రభుత్వం దీన్ని ప్రోత్సహిస్తోంది.ప్రకృతి వ్యవసాయంలో రైతులు వరి, ఇతర సాధారణ పంటలు పండించవచ్చు. అలాగే. ఆకు కూరలు, కూరగాయలు కూడా పండించవచ్చు. తద్వారా వారికి సంవత్సరమంతా ఆదాయం వస్తూనే ఉంటుంది. అందుకు వారు ఏమేం చెయ్యాలో చెప్పే పనిని డ్వా్క్రా సిబ్బంది చూసుకుంటారు. అందువల్ల రైతులు ఏదీ మర్చిపోయే ఛాన్స్ ఉండదు. సరైన పద్ధతిలో ఈ వ్యవసాయం చెయ్యడానికి వీలవుతుంది. అందువల్ల దిగుబడి ఏమాత్రం తగ్గకుండా స్థిరమైన దిగుబడి వస్తుందని అధికారులు చెబుతున్నారు.2014-19 మధ్య టీడీపీ ప్రభుత్వంలో ప్రకృతి వ్యవసాయ విభాగం ద్వారా ఈ సాగు అమలైంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక, నేచురల్ ఫార్మింగ్పై ఆసక్తి చూపలేదు. ఇప్పుడు మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి.. మళ్లీ నేచురల్ ఫార్మింగ్పై దృష్టి పెట్టారు. ప్రకృతి వ్యవసాయం వల్ల భూ సారం పెరుగుతుంది, ఆహార ఉత్పత్తుల్లో కెమికల్స్ తక్కువగా ఉండి, ప్రజల ఆరోగ్యం మెరుగవుతుంది. ఎవరైతే రైతులు ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేస్తారో.. వారు అన్ని రకాలుగా ప్రయోజనాలు పొందుతారు అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa