ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మెట్రో ఛార్జీలకు.. ఆటో ఛార్జీలకు తేడా.. పోలిక పెట్టిన నెటిజన్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 07:23 PM

ఇటీవల బెంగళూరు మెట్రో సంస్థ ఛార్జీలను భారీగా పెంచిన విషయం తెలిసిందే. దీంతో మెట్రోలో ప్రయాణించే వారి సంఖ్య కూడా అనూహ్యంగా తగ్గింది. అయితే.. మెట్రో అండ్ ఆటో ఛార్జీలను పోల్చుతూ బెంగళూరు నివాసి మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ Xలో ఒక పోస్ట్ పెట్టాడు. ఒకే మార్గంలో ఒక సారి ఆటోలో.. మరో సారి మెట్రోలో ప్రయాణం చేసి.. తేడాను చూపించాడు. వాటికి అయ్యే ఖర్చులను తన ట్విట్టర్ హ్యాండిల్‌లో పోస్ట్ చేశాడు. మల్లేశ్వర నుండి యెలచెనహళ్లికి మెట్రోలో ముగ్గురు వ్యక్తుల ప్రయాణానికి రూ.180 ఖర్చవుతుందని.. ఆటోలో అదే ప్రయాణం.. అంతే దూరానికి రూ.210 ఖర్చు అని ఆయన పేర్కొన్నారు. ఈ వైరల్ పోస్ట్ నగరంలో ప్రజా రవాణా చార్జీలపై సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. ఈ అంశంపై ఒక్కో నెటిజన్.. ఒక్కో విధంగా స్పందించారు.


మెట్రో ట్రాఫిక్ జామ్ లేకుండా ప్రయాణాన్ని అందిస్తుంది కాబట్టి మెట్రో ఛార్జీలు సరిగ్గానే నిర్ణయించబడ్డాయని ఒక వినియోగదారుడు అభిప్రాయపడుతూ.. కామెంట్ చేశారు. ట్రాఫిక్ లేకుండా.. ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేర్చే మెట్రోలో ప్రస్తుతం ఉన్న ధరలు కూడా చాలా తక్కువ అని మరో వ్యక్తి అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరో నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు. మెట్రో లోపల కనీసం నిలబడటానికి కూడా స్థలం ఉండదని.. నిలబడి నిలబడి కాళ్లకు నొప్పులు వస్తున్నాయని.. దానికి తోడు మెట్రో ఛార్జీలను పెంచడం సరికాదని వాపోయాడు. వీటి కంటే.. ప్రైవేట్ ట్రావెల్స్ బెటర్ అని చెప్పుకొచ్చాడు. మెట్రో కోచ్‌లు ఎప్పుడు రద్దీగా ఉంటాయన్నారు. మరో వినియోగదారుడు.. మెట్రోలోని సౌకర్యాన్ని హైలెట్ చేస్తూ.. ''మెట్రోలో సౌకర్యం - అమూల్యమైనది.. సామాన్యులు ప్రయాణించడానికి మెట్రో దాని ధరలను తగ్గించాలి అనే వాస్తవాన్ని తిరస్కరించడం లేదన్నారు. మరొక నెటిజన్ అనూహ్యంగా తన రూట్‌లో ఛార్జీలు తగ్గాయని.. ఇందిరానగర్ నుండి బైయప్పనహళ్లి వరకు గతంలో 15 రూపాయలు ఉండేది.. ఇప్పుడు అది 10 రూపాయలు అంటూ కామెంట్ చేశాడు.


మెట్రో రైడర్‌షిప్ డ్రాప్స్..


బెంగళూరులో మెట్రో రైలులో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య తగ్గిందని బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వర్గాలు తెలిపాయి. ఈ పెంపు అమలుకు ముందు ప్రతిరోజూ దాదాపు 8.5 లక్షల మంది ప్రయాణికులు మెట్రో రైలులో ప్రయాణిస్తున్నారని వారు తెలిపారు. ఇటీవల బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ అధికారులు ఛార్జీలను 50 శాతం పెంచారు. కొన్ని రూట్లలో ఏకంగా 100 శాతం వరకూ ఛార్జీలు పెరిగాయి. దానికి తోడు.. 'పీక్ అవర్' సమయంలో బెంగళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ 5 శాతం అదనంగా వసూలు చేయడం ప్రారంభించింది. వీటిపై ప్రయాణికులు మండిపడ్డారు. మెట్రో ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేశారు. దీంతో భారీగా ఛార్జీలు పెంచిన మార్గాల్లో 30 శాతం తగ్గిస్తూ బెంగళూరు మెట్రో నిర్ణయం తీసుకుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa