ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆస్తి కోసం కన్నతల్లిపైనే కర్కశం చూపించిన కుమార్తె

national |  Suryaa Desk  | Published : Sun, Mar 02, 2025, 07:37 PM

ప్రస్తుత కాలంలో బంధాలు, బంధుత్వాల కన్నా ఆస్తులే ముఖ్యం అయిపోయాయి. డబ్బుల కోసం కన్న తల్లిని, తండ్రిని కూడా తీవ్ర చిత్రవధలకు గురి చేస్తున్న కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, అల్లుళ్లను చూస్తూనే ఉన్నాం. పిల్లల జీవితాలు, భవిష్యత్ బాగుండాలని రెక్కలు ముక్కలు చేసుకుని కష్టపడి వారిని పెంచి, పెద్ద చేసి, ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దితే.. తల్లిదండ్రులు వృద్ధులైన తర్వాత వాళ్లను చూసుకోవడం పక్కనపెడితే ఆస్తుల కోసం వేధిస్తున్న ఘటనలు అనేకం. రూ.కోట్ల ఆస్తి ఇచ్చినా.. ముసలివాళ్లకు బుక్కెడు బువ్వ కూడా పెట్టకుండా రోడ్లపై వదిలేయడం, అనాథ శరణాలయాల్లో విడిచిపెట్టి వారి కడుపు కోతకు కారణం అవుతున్నారు. అయితే అలాంటి వారి కంటే మరింత కర్కశంగా సొంత తల్లిపై ఓ కుమార్తె ప్రవర్తించింది. ఆ ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.


హర్యానాలోని హిసార్‌ జిల్లాలో జరిగిన హృదయ విదారక ఘటన.. సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది. తల్లి పేరుపై ఉన్న ఆస్తిని తన పేరు మీదికి మార్చుకునేందుకు ఆమె కుమార్తె దారుణ హింసలకు గురి చేసింది. 3 నిమిషాల నిడివి ఉన్న ఓ వీడియో వైరల్ కాగా.. అందులో తన తల్లిపై ఆ కుమార్తె ప్రవర్తించిన తీరు.. తీవ్ర విమర్శలకు కారణం అవుతోంది. తల్లిని కొడుతూ, తన్నుతూ, కొరుకుతూ.. తనలో ఉన్న రాక్షసత్వం మొత్తాన్ని తల్లి ముందు పెట్టింది. కుమార్తె చేష్టలు చూసి ఆ తల్లి ఏడవడం తప్ప మరేమీ చేయలేక నిశ్చేష్టురాలైంది. తల్లి తొడలను కొరుకుతూ, కొడుతూ రక్తం తాగుతా అంటూ బెదిరిస్తున్నట్లు ఆ వీడియో రికార్డ్ అయింది.


9 నెలలు కడుపులో మోసి కని, పెంచిన తల్లిని తీవ్రంగా కొడుతూ ఆ కుమార్తె వికృత రూపం ప్రదర్శించింది. తల్లి తొడను కొరికి, ఆమెను నేలకేసి కొట్టి.. జుట్టు పట్టుకుని అటూ ఇటూ ఊపింది. ఆ నొప్పులు భరించలేని తల్లి.. బోరున విలపించింది. అయినా కనికరించనని ఆ కుమార్తె ఆస్తి కోసం తల్లిపై దాడి చేస్తూనే ఉంది. తనను కొట్టొద్దని ఆ తల్లి ఎంత వేడుకున్నా, దండం పెట్టినా వెనక్కి తగ్గలేదు. "నువ్వు నా చేతుల్లో చనిపోతావు.. నేను నీ రక్తం తాగుతా" అంటూ ఇష్టం వచ్చినట్లు కొట్టింది. ఇక ఈ వ్యవహారం మొత్తాన్ని బాధితురాలి కొడుకు వీడియో తీసి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆస్తి కోసం తన సోదరి.. తల్లిని చిత్రహింసలకు గురి చేస్తోందని చెప్పాడు.


హిసార్‌ జిల్లా ఆజాద్ నగర్‌లోని మోడరన్ సాకేత్ కాలనీలో ఈ దారుణం చోటు చేసుకుంది. రీటా అనే యువతికి 2 ఏళ్ల క్రితం రాజ్‌గఢ్ సమీపంలోని ఓ నికి చెందిన సంజయ్ పునియా అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. అయితే భర్తకు ఎలాంటి సంపాదన లేకపోవడంతో పెళ్లి తర్వాత.. తల్లిదండ్రుల ఇంటికి తిరిగి వచ్చిన రీటా.. వారి ఆస్తిలో వాటా కావాలని తల్లిని వేధించడం ప్రారంభించింది. రీటా తల్లి కురుక్షేత్రలోని తమ కుటుంబానికి చెందిన వివిధ ఆస్తులను విక్రయిస్తే వచ్చిన రూ.65 లక్షలను తన వద్ద ఉంచుకుంది. అయితే ఇప్పుడు రీటా తల్లిదండ్రులు నివసిస్తున్న ఇంటిని తన పేరుమీదకు మార్చాలని ఆమె డిమాండ్ చేస్తోంది. ఆ ఇంటిని తన పేరు మీద రిజిస్టర్ చేయాలని తల్లిని దారుణంగా హింసించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa