పార్వతీపురం జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. డీఈవో, ఎంఈవోలు, హెచ్ఎంలతో ఆదివారం ఆయన కలెక్టరేట్ నుంచి టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఈనెల 17 నుంచి 31 వరకు ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు టెన్త్ పరీక్షలు జరుగుతాయన్నారు. 10,455 మంది విద్యార్థులు హాజరుకానున్న నేపథ్యంలో కేంద్రాల్లో పక్కాగా ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండకూడదని, తాగునీటి వసతి కల్పించాలని, అవసరమైన మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేయాలన్నారు. ఎస్కార్ట్, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలని విద్యాశాఖాధికారులకు తెలిపారు. శతశాతం ఉత్తీర్ణత సాధించాలని, రాష్ట్రంలోనే జిల్లాను మళ్లీ ప్రథమ స్థానంలో నిలపాలని సూచించారు. పరీక్షలకు సమయం సమీపిస్తున్నందున విద్యార్థులు బాగా చదువుకునేలా చూడాలన్నారు. రాత్రివేళల్లో వారు ఎలా చదువుతున్నారో పరిశీలించాలని సూచించారు. పల్లె నిద్రలో భాగంగా కొందరు విద్యార్థులు కొన్ని సబ్జెక్టుల్లో వెనుకబడి ఉన్నట్టు గమనించామని తెలిపారు. అటువంటి విద్యార్థులందరూ సబ్జెక్టుపై పట్టు సాధించేలా చర్యలు తీసుకోవాలన్నారు. వారికి అర్థమయ్యే రీతిలో పాఠాలను బోధించాలన్నారు. క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్తో మోడల్ పాఠాలను తయారు చేసి ఉత్తమ బోధన చేయాలని హితవు పలికారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో డీఈవో ఎన్.తిరుపతినాయుడు తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa