ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో ఉచితంగా ఇళ్ల స్థలాల పంపిణీ.. మంత్రి అనగాని సత్యప్రసాద్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 03, 2025, 06:03 PM

ఆంధ్రప్రదేశ్‌లోని పేదలకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు అందిస్తామని టీడీపీ కూటమి ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే టీడీపీ కూటమి ఈ దిశగా చర్యలు చేపడుతోంది. ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. అందరికీ ఇళ్లు పథకం పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీకి సంబంధించిన అర్హతలను, వివరాలను వెల్లడించింది. తాజాగా ఇళ్ల పట్టాల పంపిణీపై ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జె్ట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఏపీ శాసనమండలిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై వైసీపీ ఎమ్మెల్సీలు అడిగిన ప్రశ్నకు.. మంత్రి అనగాని సత్యప్రసాద్ సమాధానమిచ్చారు.


అందరికీ ఇళ్ల పథకం కింద గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు చొప్పున ఇళ్ల స్థలాలను అందిస్తామని తెలిపారు. ఇళ్ల పట్టాల కోసం ఇప్పటి వరకూ 70,232 దరఖాస్తులు వచ్చినట్లు మంత్రి సత్యప్రసాద్ మండలిలో సమాధానమిచ్చారు. ఇంటి నిర్మాణానికి కూడా నాలుగు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు మంత్రి వివరించారు. ఇదే సమయంలో గత వైసీపీ హయాంలో చేపట్టిన ఇళ్ల పట్టాల పంపిణీపై మంత్రి ఆరోపణలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కేవలం సెంటు స్థలం మాత్రమే ఇచ్చారన్న మంత్రి.. తమ కూటమి ప్రభుత్వం రెండు, మూడు సెంట్ల స్థలం ఇస్తోందన్నారు. జగనన్న ఇళ్ల పథకం కుంభకోణంలా మారిందని.. లబ్దిదారుల ఎంపికలో అవకతవకలకు పాల్పడ్డారని మంత్రి సత్యప్రసాద్ ఆరోపించారు. ఇళ్ల పట్టాల పంపిణీ కోసం కొనుగోలు చేసిన భూముల కొనుగోళ్లలోనూ అక్రమాలు జరిగాయని మంత్రి ఆరోపించారు.


 అందరికీ ఇళ్లు పథకం అర్హతలు, మార్గదర్శకాలు


మరోవైపు అందరికీ ఇళ్లు పథకం పేరుతో ఇళ్ల పట్టాల పంపిణీపై ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు విడుదల చేసింది. గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలాన్ని మహిళల పేరుతో పంపిణీ చేయనున్నారు. ఈ స్థలాల్లో ఏజెన్సీల ద్వారాఇంటి నిర్మాణాలు చేపట్టనున్నారు. ఇంటి పట్టా అందించిన రెండేళ్లలోగా ఇంటి నిర్మాణం పూర్తి చేయాలని ప్రభుత్వం పేర్కొంది. అలాగే దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు మాత్రమే ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తారు.


ఇక పట్టా పొందిన లబ్ధిదారులకు పదేళ్ల తరువాతనే ఆ స్థలం మీద హక్కులు లభిస్తాయి. ప్రభుత్వం నుంచి ఒక్కసారి మాత్రమే ఉచిత ఇంటి స్థలం పొందేలా విధి విధానాలు రూపొందించారు. అలాగే సొంతిల్లు ఉండేవారికి ఈ పథకం వర్తించదు. అలాగే గతంలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఇళ్లు పొంది ఉండకూడదని మార్గదర్శకాల్లో పేర్కొన్నారు. అలాగే రేషన్ కార్డు ఉండి, 5 ఎకరాల్లోపే మెట్ట, 2.5 ఎకరాల్లోపు మాగాణి భూమి ఉన్నవారు ఈ పథకానికి అర్హులు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa