దైవదర్శనం కోసం ఆలయానికి వెళ్లిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి కుమార్తెను పోకిరీలు వేధింపులకు గురిచేశారు. ఆమెకు రక్షణగా భద్రతా సిబ్బంది వెంట వచ్చినా.. వారి కళ్లుగప్పి అసభ్యకరంగా తాకుతూ వేధించారు. మహాశివరాత్రి రోజున మహారాష్ట్రలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులకు కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు. అంతేకాదు, తమ సొంత రాష్ట్రంలో శాంతిభద్రతలపై ఆయన ఆందోళన వ్యక్తం చేయడం గమనార్హం. తన కుమార్తెను ఆకతాయిలు వేధింపులకు గురిచేసినట్టు ఆయనే స్వయంగా ఆయన మీడియాకు వెల్లడించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.
వివరాల్లోకి వెళ్తే..మహారాష్ట్రకు చెందిన కేంద్ర యువజన, క్రీడా శాఖ సహాయ మంత్రి రక్షా ఖడ్సే కుమార్తె... జల్గావ్ జిల్లా ముక్తాయ్నగర్లో మహాశివరాత్రి రోజున జరిగే కార్యక్రమంలోఆమె పాల్గొన్నారు. స్నేహితులతో కలిసి వెళ్లిన ఆమెకు రక్షణగా సెక్యూరిటీ గార్డులను ఖడ్సే పంపారు. అక్కడే పోకిరీలు ఆమెను వేధించారు. మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా జలగావ్ జిల్లాలో ఏటా సంత్ ముక్తాయ్ యాత్ర నిర్వహిస్తారు.. స్నేహితులతో కలిసి ఆ యాత్రకు వెళ్తానని నా కుమార్తె అడగటంతో భద్రతా సిబ్బంది సాయంతో అక్కడకు పంపించాను.. ఆ సమయంలో కొందరు ఆకతాయిలు వారిని వెంబడించి వేధించారు.
కేంద్ర మంత్రి కుమార్తెకే ఇటువంటి అనుభవం ఎదురైతే.. సాధారణ మహిళల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు.. ఈ ఘటనపై స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాను.. నేను కేంద్ర మంత్రి, ఎంపీగా కాదు తల్లిగా వచ్చి న్యాయకోరుతున్నాను.. నేను బీజేపీకి చెందిన ఎంపీని, రాష్ట్రంలో మా పార్టీయే అధికారంలో ఉంది.. సామాన్యులకే కాదు మంత్రుల కుటుంబాలకు రక్షణ లేదు..’ అని మంత్రి ఖడ్సే వ్యాఖ్యానించారు. స్వయంగా కేంద్ర మంత్రే తన కుమార్తెను ఆకతాయిలు వేధించినట్టు చెప్పడంతో ప్రతిపక్షానికి ఆయుధం చేతికిచ్చినట్టయ్యింది. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళలకు రక్షణ లేదని ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ విమర్శలు గుప్పిస్తోంది. ఈ తరుణంలో కేంద్ర మంత్రి కుమార్తె వ్యవహారం వెలుగులోకి రావడం గమనార్హం.
అయితే, ఈ ఘటనపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ స్పందించారు. నిందితులు ఓ రాజకీయ పార్టీకి చెందినవాళ్లని తెలిపారు. వీరిలో కొందరిని పోలీసులు అరెస్టు చేశారని ఫడ్నవీస్ చెప్పారు. కాగా, ఇటీవల పుణేలో నిర్బయ తరహాలో మహిళపై అత్యాచారం చోటుచేసుకుంది. ఇక,ముక్తాయ్నగర్ డీఎస్పీ కుషాంత్ పింగ్డే మాట్లాడుతూ.. నిందితులు చాలా మంది అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించారని, కేంద్ర మంత్రి కుమార్తె వెంట వెచ్చిన సెక్యూరిటీతో ఘర్షణకు దిగారని వివరించారు. ఈ ఘటనకు సంబంధించి ఏడుగురిపై కేసు నమోదుచేసిన పోలీసులు.. ఒకరిని అరెస్టు చేసినట్లు చెప్పారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa