కేరళకు చెందిన ఓ వ్యక్తి ఇటీవలే ఉపాధి నిమిత్తం జోర్డాన్ వెళ్లాడు. కానీ దురదృష్ట వశాత్తు ఆయనకు వర్క్ వీసాకు బదులుగా విజిట్ వీసా ఇప్పించారు. దీంతో సదరు వ్యక్తి అక్కడి పని చేసుకునేందుకు వీల్లేకపోవడంతో.. బంధువుతో కలిసి అక్రమంగా ఇజ్రాయెల్లోకి ప్రవేశించబోయాడు. విషయం గుర్తించిన జోర్డాన్ సైనికులు అతడిపై కాల్పులు జరిపారు. ఈక్రమంలోనే సదరు వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. ఫిబ్రవరి 10వ తేదీన ఈ ఘటన జరగ్గా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే భర్త మృతదేహాన్ని ఎలాగైనా ఇండియాకు పంపించమంటూ మృతుడి భార్య కోరుతుండగా.. భారత విదేశాంగ శాఖ ఏర్పాట్లు చేపట్టింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
కేరళలోని తుంబాకు చెందిన 47 ఏళ్ల థామస్ గాబ్రియేల్ పెరెరా, మేనంకుళంలోలని కిన్ ఫ్రా పార్క్ సమీపంలో ఉన్న 43 ఏళ్ల ఎడిసన్లు బంధువులు. అయితే వీరద్దరూ కలిసి ఫిబ్రవరి 5వ తేదీన జోర్డాన్ వెళ్లారు. వర్క్ వీసా ఇప్పిస్తానని చెబుతూ ఏజెంట్ మోసం చేసి.. వీరిని విజిట్ వీసాపై జోర్డాన్ పంపాడు. అక్కడకు వెళ్లాకా అసలు విషయం తెలుసుకున్న థామస్, ఎడిసన్లు అక్కడి అధికారులకు దొరక్కుండా ఉండాలని పథకం వేశారు. ఈక్రమంలోనే సరిహద్దు గుండా ఇజ్రాయెల్లోకి ప్రవేశించాలని అనుకున్నారు. వీరి వెంట మరో ఇద్దరు వ్యక్తులు కూడా ఉండగా.. ఫిబ్రవరి 9వ తేదీన ఇళ్లకు ఫోన్లు చేసి విషయం చెప్పారు.
ఆపై 10వ తేదీన నలుగురు వ్యక్తులు కలిసి పర్వత లోయ గుండా సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారు. ఈక్రమంలోనే విషయం గుర్తించిన జోర్డాన్ ఆర్మీ సైనికులు వీరిపై కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో థామస్ గాబ్రియేల్ పెరెరా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఇతడి బంధువు ఎడిసన్కు గాయాలు కాగా.. అతడిని ఆస్పత్రిలో చేర్చారు. అలాగే మరో ఇద్దరు బాగానే ఉండగా.. వారిని జైల్లో బంధించారు. చికిత్స నిమిత్తం ఎడిసన్ను జోర్డాన్ నుంచి బహిష్కరించి తిరిగి ఇండియాకి పంపించారు. ఈక్రమంలోనే అతడు ఇంటికి చేరుకున్నాడు. వచ్చిన వెంటనే థామస్ మృతి గురించి అతడి కుటుంబ సభ్యులకు చెప్పాడు.
ఇలా విషయం తెలుసుకున్న థామస్ భార్య, ఇతర కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. భర్త మృతదేహం పంపిస్తే చివరి చూపైనా చూసుకుంటామంటూ గుండెలవిలేసా రోదిస్తున్నారు. అయితే తాజాగా భారత రాయబార కార్యాలయానికి తమ బాధను చెప్పగా.. థామస్ మృతదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా ఇటు కుటుంబ సభ్యులతో అటు జోర్డాన్ అధికారులను కలిసి పని చేస్తూ.. థామస్ మృతదేహం కేరళ తెప్పించేందుకు చర్యలు చేపడుతున్నారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా జోర్డాన్లోని భారత రాయబార కార్యాలయం వివరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa