రాష్ట్రంలోని ప్రతి పౌరుడూ డిజిటల్ అక్షరాస్యుడిగా మారాలని, తద్వారా రాష్ట్రాన్ని సంపూర్ణ డిజిటల్ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా తీర్చి దిద్దాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులకు సూచించారు. పీపుల్స్ పర్సెప్షన్, ఆర్టీజీఎస్ పైన సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాట్సాప్ గవర్నెన్స్ ప్రగతి గురించి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రజలందరూ వాట్సాప్ గవర్నెన్స్ సులభంగా ఉపయోగించుకునేలా, ప్రభుత్వం నుంచి ఏ సేవ కావాలన్నా అధికారులు, కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా కల్పిస్తోందన్నారు. దీనిపై ప్రజల్లో ఇంకా కొంత అవగాహన తక్కువగా ఉందని, ప్రజలందరూ సమర్థవంతంగా వాట్సాప్ గవర్నెన్స్ను విరివిగా వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని, ఇందుకు జిల్లా కలెక్టర్లందరూ బాధ్యత తీసుకుని తమ జిల్లాలో ప్రజల్లో వాట్సాప్ గవర్నెన్స్ను పెద్ద ఎత్తున ఉపయోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. సచివాలయాలు, సచివాలయ సిబ్బంది ద్వారా ఆయా ప్రాంతాల్లో దీని గురించి ప్రజల్లో అవగాహన పెంపొందించాలన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రజలు కేవలం ప్రభుత్వం నుంచి సేవలు పొందడమే కాదని, ఫిర్యాదులు, అర్జీలు కూడా పెట్టుకోవచ్చని సీఎం అన్నారు. ఈ సదుపాయం గురించి కూడా ప్రజలకు వివరించాలన్నారు. నిరక్షరాస్యులు కేవలం తమ ఫిర్యాదును వాయిస్ ద్వారా కూడా వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వానికి తెలిపే సదుపాయాన్ని త్వరలో కల్పించబోతున్నామని తెలిపారు. పౌరుల్లో డిజిటల్ అక్షరాస్యత పెరిగితే వాట్సాప్ గవర్నెన్స్ ఉపయోగిత కూడా పెరుగుతుందన్నారు. వాట్సాప్ ద్వారా ప్రస్తుతం 200 రకాలైన సేవలు ప్రజలకు అందిస్తున్నామని ఐటీ మరియు రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి భాస్కర్ కాటంనేని ముఖ్యమంత్రికి వివరించారు. ఈ నెలాఖరు లోపు మరో 150 అదనపు సేవలు కల్పిస్తామని తద్వారా వాట్సాప్ ద్వారా ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సేవలు 350కి చేరుతాయన్నారు. తదుపరి దశలో మొత్తం 500 సేవలు కల్పిస్తామన్నారు. రాబోయే రోజుల్లో ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్సును పెద్ద ఎత్తున ఉపయోగించుకుని వన్ స్టేట్ వన్ యాప్ విధానంలో ప్రజలకు అన్ని సేవలు కేవలం ఒక ప్లాట్ఫాంలో లభించేలా ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ, వ్యవసాయశాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు, హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత, అటవీశాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్. సీఎం కార్యదర్శులు ముద్దాడ రవిచంద్ర, పీఎస్ ప్రద్యుమ్న, రాజమౌళి, హోంశాఖ ఐటీ సెల్ ఐజీ శ్రీకాంత్, ఐజీ ఈగల్ ఆర్ కె రవికృష్ణ, సీఈఓ వి. కరుణ, ఆర్టీజీఎస్ డిప్యూటీ సీఈఓ ఎం. మాధురి తదితరులు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa