ఏపీలోని కూటమి ప్రభుత్వం భవన నిర్మాణదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై 18 మీటర్ల లోపు లేదా ఐదంతస్తుల లోపు భవనాల నిర్మాణాల అనుమతులకు స్వీయ ధ్రువీకరణ పత్రం ఇస్తే సరిపోతుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నుంచి ఎలాంటి అనుమతి అవసరం లేకుండానే భవన నిర్మాణాలకు పర్మిషన్ వచ్చేస్తుంది. కాకపోతే భవన యజమానులు రిజిస్టర్డ్ ఎల్టీపీలు, ఇంజినీర్లు లేదా ఆర్కిటెక్ట్ల సమక్షంలో సరైన పత్రాలు సమర్పించి స్వీయ ధ్రువీకరణ (అఫిడవిట్) ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి గత నెలలోనే భవన నిర్మాణ అనుమతులకు కొత్త విధానం అమల్లోకి తీసుకొస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసినప్పటికీ సాంకేతిక కారణాలతో జాప్యం జరిగింది. భవన నిర్మాణాల అనుమతుల ప్రక్రియను త్వరితగతిన జారీ చేసేలా ఈ కొత్త విధానాన్ని సర్కార్ అందుబాటులోకి తీసుకొచ్చింది. సెల్ఫ్ సర్టిఫికేషన్ ద్వారా నిర్మాణాలకు అనుమతులిచ్చేందుకు అవసరమైన సాఫ్ట్వేర్ను APDPMS పోర్టల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చినట్లు మంత్రి నారాయణ ఒక ప్రకటనలో తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa