కర్ణాటక అసెంబ్లీలో ఎమ్మెల్యేలకు ఏర్పాటు చేస్తున్న సౌకర్యాలపై కొన్ని వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. బెంగళూరు విధాన సౌధ భవనంలో ఇప్పటికే స్పీకర్ యూటీ ఖాదర్ ఇచ్చిన ఆదేశాలతో రిక్లెయినర్ సీట్లను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరిన్ని సౌకర్యాలు కల్పించేందుకు స్పీకర్ సిద్ధం అయ్యారు. విధాన సౌధలో ఎమ్మెల్యేల కోసం స్మార్ట్ లాక్స్, మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేయాలని.. అందుకోసం రూ.3 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు స్పీకర్ యూటీ ఖాదర్ తాజాగా వెల్లడించారు. అయితే ఈ నిర్ణయాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా విమర్శించింది. పాలనపై దృష్టి పెట్టకుండా ఇలాంటి అనవసర ఖర్చులు చేస్తున్నారని మండిపడుతున్నారు. కర్ణాటకలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకుండా ఇలా వృథా ఖర్చులు చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి ఆరోపించారు.
అయితే ఎమ్మెల్యేలకు మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పీకర్ యూటీ ఖాదర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు.. వారి రూమ్లలో స్మార్ట్ లాక్స్ ఏర్పాటు చేయడం వల్ల వారి భద్రత పెరగడంతో పాటు.. సులభంగా ప్రవేశించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ఇవే కాకుండా ఎమ్మెల్యేలకు మరిన్ని అదనపు సౌకర్యాలు కూడా ఏర్పాటు చేస్తామని తెలిపారు. త్వరలోనే అసెంబ్లీ లాబీల్లో రిక్లయినర్లతో పాటు మసాజ్ కుర్చీలు కూడా ఏర్పాటు చేస్తామని స్పీకర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు ఎక్కువ సేపు పని చేయడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురి అవుతున్నారని.. వారు చేస్తున్న పనికి ఇవి విలాసాలు కావని తేల్చి చెప్పారు. వారి అవసరాలు తీర్చేందుకే వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు స్పీకర్ ఖాదర్ తెలిపారు. ఇలాంటి సౌకర్యాలకు ఎమ్మెల్యేలు పూర్తిగా అర్హులు అని వెల్లడించారు.
అంతేకాకుండా ఎమ్మెల్యేలు అసెంబ్లీకి రావడానికి.. వారి హాజరు శాతాన్ని పెంచడం కోసం.. సభలో వారి భాగస్వామ్యాన్ని మెరుగుపరచడానికి స్పీకర్ చేస్తున్న ప్రయత్నాలను సమర్థిస్తున్నట్లు కర్ణాటక గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ప్రియాంక్ ఖర్గే తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఒత్తిడితో పనిచేస్తున్నారని.. పైగా చాలామంది సీనియర్ సిటిజన్లు కావడం వల్ల ఇలాంటి ఏర్పాట్లు మంచివేనని అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పేర్కొన్నారు. అయితే స్పీకర్ యూటీ ఖాదర్ తీసుకున్న ఈ చర్యలను బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. ముఖ్యమైన పాలనా పరమైన సమస్యలపై దృష్టి పెట్టకుండా.. ఇలాంటి అనవరసర ఖర్చులు చేయడం ఏంటని మండిపడింది. కర్ణాటకలో నిధుల కొరత కారణంగా.. పని చేసిన కాంట్రాక్టర్లకు బిల్లులు కూడా చెల్లించడం లేదని బీజేపీ ఎమ్మెల్సీ సీటీ రవి తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.
ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ లాబీల్లో కాసేపు సేదదీరడానికి 15 రిక్లయినర్ సీట్లను ఏర్పాటు చేస్తున్నామని స్పీకర్ ఖాదర్ గత వారమే వెల్లడించారు. లంచ్ తర్వాత ఎమ్మెల్యేలు విధాన సౌద నుంచి బయటికి వెళ్లి తిరిగి సభకు రావడం లేదని పేర్కొన్నారు. ఏడాదిలో 30 రోజులు మాత్రమే అసెంబ్లీ పని చేస్తుందని.. కాబట్టి రిక్లయినర్లు, మసాజ్ కుర్చీలను కొనుగోలు చేయడం లేదని.. కేవలం వాటిని అసెంబ్లీ సమావేశాల సమయంలో మాత్రమే తీసుకువచ్చి.. ఆ తర్వాత వాటిని తిరిగి పంపుతామని స్పీకర్ ఖాదర్ వివరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa