అవినీతికి ఆరోపణలతో అరెస్టైన పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ జీవితం జైల్లోనే ముగిసిపోతుందా? అంటే అవుననే అంటున్నారు ఆయన మద్దతుదారులు. ప్రస్తుతం రావల్పిండిలోని అడియాలా జైల్లోని డెత్ సెల్లో ఆయనను ఒంటరిగా నిర్బంధించినట్టు ఇమ్రాన్ పార్టీ ‘పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్’ (పీటీఐ) సెంట్రల్ ఇన్ఫర్మేషన్ సెక్రెటరీ షేక్ వాకాస్ అక్రమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. కరుడగట్టిన ఉగ్రవాదుల కోసం నిర్దేశించిన సెల్లో విచారణ ఖైదీ అయిన ఓ మాజీ ప్రధాని పట్ల జైలు అధికారులు ఇలా ప్రవర్తించడం సిగ్గుచేటని పీటీఐ ఆరోపించింది. అంతేకాదు, తమ నేతను కలవడానికి న్యాయస్థానం అనుమతించినా.. జైలు అధికారులు మాత్రం అడ్డుకుంటున్నారని ఆరోపణలు చేసింది.
‘‘మా అధినేత ఇమ్రాన్ ఖాన్ను కలిసేందుకు ఆరుగురు వ్యక్తులకు న్యాయస్థానం అనుమతించింది.. అయినప్పటికీ జైలు అధికారులు అనుమతించడం లేదు.. ఇమ్రాన్ను కలిసేందుకు వెళ్లిన ఆయన భార్యను సైతం ఎలాంటి వివరణ ఇవ్వకుండా రెండుసార్లు తిప్పిపంపారు.. పుస్తకాలు, వార్తా పత్రికలను ఇవ్వడంలేదు. ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ ఇమ్రాన్ మాత్రం దృఢ సంకల్పంతో ఉన్నారు’’ అని పీటీఐ పార్టీ వెల్లడించింది. తోషఖానా సహా పలు కేసులకు సంబంధించి 2023 ఆగస్టులో అరెస్టైన ఇమ్రాన్ఖాన్ అప్పటినుంచి జైల్లోనే ఉన్నారు.
కాగా, ఈ ఏడాది జనవరిలో అల్-కాదిర్ ట్రస్టు అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్2కు ఇస్లామాబాద్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఆయనకు రూ.10 లక్షల జరిమానా కూడా విధించింది. ఇదే కేసులో అకౌంటబిలిటీ కోర్టు ఇమ్రాన్ భార్య బుస్రా బీబీకి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5 లక్షల జరిమానాను వేయడం గమనార్హం. కాగా, 2018 పాకిస్థాన్ ఎన్నికల్లో ఇమ్రాన్ పార్టీ పీటీఐ విజయం సాధించడంతో ఆయన పాక్ ప్రధానిగా పగ్గాలు చేపట్టారు. కానీ, 2022 ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానంలో ఓడిపోయి పదవిని కోల్పోయారు. తనను పదవీచ్యుతుడ్ని చేయడానికి అమెరికా కుట్ర పన్నిందని ఇమ్రాన్ ఆరోపించారు. పాక్ మాజీ ప్రధాని చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజమూలేదని అమెరికా ఖండించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa