పదో తరగతి పరీక్షలు రాసేందుకు ముస్తాబయ్యారు. రోజూలాగే 7 సీటర్ కారులో మొత్తంగా 13 మంది విద్యార్థులు ఎక్కారు. ఒకరిపై ఒకరు కూర్చుని పరీక్షకు వెళ్తుండగా.. మార్గమధ్యంలో టైరు పేలింది. అప్పటికే కారు చాలా వేగంగా వెళ్తుండడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు విద్యార్థులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. మిగతా వారంతా తీవ్ర గాయాలపాలయ్యారు. ముఖ్యంగా ఇందులో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.
ఉత్తర ప్రదేశ్లోని పురందర్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సమర్ధిర, విఘన్ పూర్, కర్మహా బుజుర్గ్, కర్మహా గ్రామాలకు చెందిన 13 మంది పదో తరగతి చదువుతున్న విద్యార్థులు.. మహారాజ్గంజ్లో పదో తరగతి బోర్డు పరీక్షలు రాస్తున్నారు. అయితే వీరంతా కలిసి వెళ్లేందుకు ఓ కారును మాట్లాడుకోగా.. రోజూ ఉదయమే డ్రైవర్ వచ్చి వారందరినీ పరీక్షా కేంద్రానికి తీసుకువెళ్తున్నారు. రోజూలాగే మంగళవారం రోజు కూడా ఆయా గ్రామాలకు వెళ్లిన డ్రైవర్.. 13 మంది విద్యార్థును తన 7 సీటర్ SUV కారులో ఎక్కించుకున్నాడు.
అందులో కూర్చోవడం చాలా కష్టంగా ఉన్నా సరే ఒకరిపై ఒకరు కూర్చుని మరీ విద్యార్థులు ప్రయాణం చేస్తున్నారు. అయితే అప్పటికే కారులో ఎక్కువ మంది ఉండగా.. కాస్త నెమ్మదిగా పోవాల్సిన డ్రైవర్ చాలా వేగంగా వెళ్లాడు. దురదృష్టవశాత్తు మార్గ మధ్యంలో టైర్ పేలింది. ఫలితంగా కారు బోల్తా కొట్టింది. దీంతో కారులో ఉన్నవారందరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. విషయం గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు అంబులెన్సు ద్వారా విద్యార్థులు, డ్రైవర్ ను స్థానిక ప్రభుత్వాసుపత్రికి పంపించారు.
ఈక్రమంలోనే అందులో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. అలాగే డ్రైవర్ సహా మరో 11 మంది తీవ్రంగా గాయపడినట్లు గుర్తించారు. ప్రస్తుతం వారందరికీ చికిత్స అందిస్తున్నా.. వారి పరిస్థితి విషమంగా ఉందని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోందని వైద్యులు చెబుతున్నారు. దీనిపై పోలీసులు స్పందిస్తూ.. మృతులు చాందిని (17), ప్రతి(17), గాయత్రి (17)గా గుర్తించారు. అలాగే గాయపడిన వారిలో నందిని (17), చాందిని (16), ప్రియాంక (17), రింజిమ్ (18), మనీషా (16), సోని (18), డ్రైవర్ రియాజ్ ఉన్నట్లు తెలిపారు. అయితే క్షతగాత్రుల్లో మరో నలుగురు విద్యార్థులను ఇంకా గుర్తించలేదని చెప్పారు.
రోడ్డు ప్రమాదం గురించి తెలుసుకున్న విద్యార్థులు తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తూ.. ఆస్పత్రికి చేరుకున్నారు. వారి గాయాలు చూస్తూ గుండెలవిసేలా రోదిస్తున్నారు. పరీక్షలు రాసి వస్తామని చెప్పి వెళ్లిన విద్యార్థులు కానరాని లోకాలకు వెళ్లడాన్ని జీర్ణించుకోలేకపోతున్నామంటూ గుండెలు బాదుకుంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa