ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షి వాచ్‌మెన్ రంగన్న మృతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 10:09 PM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. వైఎస్ వివేకా హత్య కేసులో ప్రధాన సాక్షిగా ఉన్న వాచ్‌మెన్ రంగన్న మృతి చెందారు. వాచ్‌మెన్ రంగన్న వయస్సు 85 సంవత్సరాలు కాగా.. గత కొంతకాలంగా పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే బుధవారం మధ్యాహ్నం వాచ్‌మెన్ రంగన్న తీవ్ర అస్వస్థతకు గురికావటంతో పోలీసులు కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. రిమ్స్ ఆసుపత్రిలో రంగన్న చికిత్స పొందుతు ప్రాణాలు కోల్పోయారు.


2019 మార్చి 15వ తేదీన పులివెందులలోని తన ఇంట్లో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు గురయ్యారు. ఈ ఘటన అప్పట్లో తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపింది. వైఎస్ వివేకానందరెడ్డి హత్య సమయంలో రంగన్న వాచ్‌మెన్‌గా పని చేస్తూ ఉన్నారు. దీంతో వివేకా హత్య కేసు విచారణలో రంగన్న కీలకంగా మారారు. అలాగే విచారణలో భాగంగా సీబీఐకు ఇచ్చిన వాంగ్మూలంలో రంగన్న పలు కీలకమైన అంశాలు వెల్లడించారు, దీంతో వైఎస్ వివేకా హత్య కేసులో కీలక సాక్షిగా రంగన్న వాంగ్మూలాన్ని నమోదు చేసినట్లు కేంద్ర దర్యాప్తు సంస్థ అప్పట్లో పేర్కొంది. ఛార్జిషీట్‌లోనూ పలు వివరాలు సీబీఐ ప్రస్తావించింది. అయితే వయసు సంబంధిత అనారోగ్యంతో రంగన్న బాధపడుతున్నారు. ఈ క్రమంలోనే బుధవారం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు.


వాచ్‌మెన్ రంగన్న మృతిని కడప రిమ్స్ ఆస్పత్రి వైద్యులు కూడా ధ్రువీకరించారు. అనంతరం రంగన్న మృతదేహాన్ని ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించారు. మరోవైపు వైఎస్ వివేకా హత్య కేసు ఇప్పటికే అనేక మలుపులు తిరిగింది. ఏపీ పోలీసుల నుంచి సీబీఐ చేతికి వెళ్లింది. అక్కడ కూడా అనేక మలుపులు తిరుగుతూ వస్తోంది. నిందితులు, బెయిల్, విచారణలు అంటూ నిత్యం వార్తల్లో ఉంటూనే వస్తోంది. అలాగే 2024 ఎన్నికల సమయంలోనూ వైఎస్ వివేక హత్య కేసు వ్యవహారం చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా వాచ్‌మెన్ రంగన్న మరణంతో వైఎస్ వివేకా హత్య కేసు మరోసారి వార్తల్లో నిలిచింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa