ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏడాదిలో 30 సార్లు దుబాయ్‌ టూర్, 50 కిలోల బంగారం,,,నటి రన్యా రావు కేసులో ట్విస్ట్‌లు

national |  Suryaa Desk  | Published : Wed, Mar 05, 2025, 10:34 PM

దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకువస్తూ.. బెంగళూరు కెంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులో డీఆర్ఐ అధికారులకు అడ్డంగా దొరికిపోయిన కన్నడ నటి రన్యా రావు కేసులో కీలక మలుపులు చోటు చేసుకుంటున్నాయి. దుబాయ్ నుంచి 14.2 కిలోల బంగారాన్ని దుస్తుల్లో దాచుకుని తీసువచ్చి.. ఎయిర్‌పోర్టు నుంచి బయటికి వచ్చే చివరి నిమిషంలో దొరికిన రన్యా రావును అరెస్ట్ చేసిన పోలీసులు.. ఆమె ఇంట్లో సోదాలు చేశారు. అక్కడ రూ.2 కోట్ల విలువైన ఆభరణాలతోపాటు రూ.2 కోట్లకు పైగా నగదు కూడా లభ్యం అయ్యాయి. దీంతో ఈ కేసులో మొత్తం రన్యా రావు నుంచి రూ.17.29 కోట్లకుపైగా విలువైన బంగారం, నగదును సీజ్ చేసినట్లు డీఆర్ఐ అధికారులు తెలిపారు.


అయితే రన్యా రావు ఇటీవల తరచూ గల్ఫ్‌ దేశాలకు వెళ్లి వస్తున్నట్లు అధికారుల నిఘాలో వెల్లడైంది. గత 2 నెలల్లోనే దాదాపు 10 సార్లు, గత 15 రోజుల్లోనే నాలుగుసార్లు ఆమె దుబాయ్‌కి వెళ్లి రావడం అనుమానాలకు తావిచ్చింది. ఇక దుబాయ్‌కి వెళ్లిన ప్రతిసారి ఒకే రకమైన బట్టలు వేసుకున్నట్లు గుర్తించారు. దీంతో అప్రమత్తమైన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు.. ఆమె రాకపోకలపై నిఘా పెట్టి చివరికి ఇటీవల రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే గత ఏడాది కాలంగా ఆమె 30 సార్లు దుబాయ్ వెళ్లి వచ్చినట్లు తేల్చారు.


ఇక దుబాయ్‌ నుంచి బెంగళూరు వచ్చిన రన్యా రావు.. కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో సాధారణ ప్రయాణికురాలిగా సెక్యూరిటీ చెకింగ్ దాటి బయటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ సహాయంతో ఎగ్జిట్ డోర్ వైపు వెళ్లింది. అప్పటికే అక్కడ వేచిచూస్తున్న డీఆర్‌ఐ అధికారులు రన్యా రావును అడ్డగించి తనిఖీలు నిర్వహించగా.. ఆమె బెల్టులో కిలోల కొద్ది బంగారం బయటికి వచ్చింది. ఇటీవలి కాలంలో బెంగళూరు కెంపెగౌడ ఎయిర్‌పోర్టులో స్వాధీనం చేసుకున్న బంగారంలో ఇదే అతిపెద్దదని అధికారులు వెల్లడించారు.


అయితే ఆమెను అరెస్ట్ చేసిన తర్వాత దర్యాప్తు చేపట్టిన అధికారులకు రన్యా రావు సంచలన విషయాలు వెల్లడించినట్లు సమాచారం. గోల్డ్ స్మగ్లింగ్‌ చేయాలని తనను కొందరు బ్లాక్‌మెయిల్‌ చేశారని తెలిపింది. అయితే ఎయిర్‌పోర్టులో రన్యా రావుకు సాయం చేసిన కానిస్టేబుల్‌ స్టేట్‌మెంట్‌ను అధికారులు రికార్డ్ చేశారు. త్వరలోనే ఆమె భర్తను కూడా విచారించే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇక రన్యా రావు సవతి తండ్రి కే రామచంద్రారావు కర్ణాటక డీజీపీ (పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌)గా పనిచేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గోల్డ్ స్మగ్లింగ్‌ చేస్తూ దొరికి పోయిన రన్యా రావు వ్యవహారంపై స్పందించిన కర్ణాటక సీనియర్‌ ఐపీఎస్‌ రామచంద్రారావు ఆమె చేసే పనులతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. 4 నెలల క్రితమే ఆమెకు పెళ్లి అయిందని.. అప్పటి నుంచి తమ ఇంటికి రాలేదని తెలిపారు. ఆమె, తన భర్తతో పాటు ఎలాంటి వ్యాపారాలు చేస్తోంది అనే విషయం తమకు తెలియదని వెల్లడించారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పేర్కొన్నారు.


ఇక రన్యా రావు అరెస్ట్‌పై కర్ణాటక హోం శాఖ మంత్రి జీ పరమేశ్వర స్పందించారు. ప్రస్తుతం ఈ కేసును డీఆర్‌ఐ అధికారులు దర్యాప్తు చేస్తున్నారని.. అది కేంద్ర దర్యాప్తు సంస్థ కావడం వల్ల దానిపై ఇప్పుడే ఏమీ మాట్లాడలేమని చెప్పారు. ఈ కేసును అంతర్గతంగా పరిశీలించాలని పోలీస్ డిపార్ట్‌మెంట్‌కు సూచించినట్లు జీ పరమేశ్వర వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa