హైదరాబాద్లో మరో అతిపెద్ద స్కాం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే మార్కెట్లో పెద్ద పెద్ద కుంభకోణాలు వెలుగులోకి వస్తుండగా.. ఇప్పుడు మరో కొత్త స్కాం బయటపడింది. అందులోనూ పూటకో సైబర్ మోసం వెలుగులోకి వస్తూ.. జనాలను గజగజా వణికిస్తున్నాయి. అమాయకులను బురిడీ కొట్టిస్తూ ఖాతాలు ఖాళీ చేస్తున్న సైబర్ నేరగాళ్లను కట్టడి చేసేందుకు పోలీసులు ఎంత ప్రయత్నిస్తున్నా.. కొత్త కొత్త రూపాల్లో దోపిడీలకు పాల్పడుతూ సవాళ్లు విసురుతూనే ఉన్నారు. మోసం జరుగుతుంది అని తెలుసుకునేలోపే.. జరగాల్సిన నష్టం అప్పటికే జరిగిపోతుండటంతో.. లబోదిబోమంటూ గుండెలు బాదుకోవటమే బాధితుల వంతవుతోంది. ఈ నేపథ్యంలో.. నగరంలో కొత్త స్కాం వెలుగులోకి వచ్చింది.
అమెరికాకు చెందిన 'పే పాల్' యాప్ వినియోగిస్తున్న కస్టమర్ల డేటాను చోరీ చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. విదేశాల్లో ఉంటున్న కస్టమర్లే టార్గెట్గా ఈ కుంభకోణానికి తెరతీసినట్టు పోలీసులు గుర్తించారు. దీంతో పాటు.. హ్యాక్ అయిన బ్యాంకు ఖాతాలను సరిచేస్తామంటూ కస్టమర్లను నమ్మించి.. బ్యాంకు అకౌంట్, డెబిట్, క్రెడిక్ కార్డుల వివరాలు సేకరించి ఖాతాల్లో నగదు కాజేస్తున్నట్టు గుర్తించారు. ఈ కాల్ సెంటర్ మీద.. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సోదాలు చేసి సుమారు 63 మందిని అదుపులోకి తీసుకుంది. అలాగే, భారీగా కంప్యూటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకుంది.
హైటెక్ సిటీలోని పత్రికా నగర్ వేదికగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠా ఆగడాల గురించి.. సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు వెల్లడించారు. ఈ స్కాంలో భాగంగా ఇప్పటివరకు 63 మంది సైబర్ నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నామని పేర్కొన్నారు. నిందితుల్లో ఎక్కువ మంది ఈశాన్య దేశాలకు చెందిన వాళ్లే ఉన్నారని తెలిపారు. అమెరికాకి చెందిన పే పాల్ అనే యాప్ ద్వారా సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని.. అధునాతన సాప్ట్ వేర్లు ఉపయోగించి మోసాలకు పాల్పడుతున్నట్టు వివరించారు.
విదేశాల్లో ఉన్న కస్టమర్లనే లక్ష్యంగా చేసుకుని ఫిషింగ్ మెయిల్స్ పంపుతున్నారని... ఫ్రాడ్ ప్రివెన్షన్ టీమ్ అని చెప్పుకుంటూ కాల్స్ చేస్తున్నారని అధికారులు తెలిపారు. 63 మంది నిందితుల్లో 22 మంది అమ్మాయిలు ఉన్నట్టు పేర్కొన్నారు. సోషల్ మీడియాలో ఉద్యోగాల పేరుతో ప్రకటనలు ఇచ్చి వీళ్లను రిక్రూట్ చేసుకున్నారని చెప్పుకొచ్చారు. కాల్ సెంటర్లో ఉద్యోగాల పేరుతో వీరిని నియమించుకున్నట్టు తెలిపారు. ఎలా సైబర్ నేరాలకు పాల్పడాలో కూడా శిక్షణ ఇచ్చారని తెలిపారు. ఒక్కొకరికి రూ. 30 వేల జీతం కూడా ఇచ్చారని అధికారులు వివరించారు.
Exito సొల్యూషన్స్ ఎండీ చందా మనస్వినిని కూడా అరెస్ట్ చేసినట్టు అధికారులు ప్రకటించారు. నెట్వర్క్ను ఆపరేట్ చేస్తున్న జాదు భాయ్, రాహుల్ అలియాస్ ప్రతిక్ను కూడా అదుపులోకి తీసుకున్నామని చెప్పుకొచ్చారు. నిందితుల నుంచి 52 మొబైల్ ఫోన్స్, 63 ల్యాప్ టాప్స్, 27 ఐడీ కార్డ్స్ స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa