ఛాంపియన్స్ ట్రోఫీ 2025 తుది అంకానికి చేరుకుంది. ఆదివారం భారత్- న్యూజిలాండ్ జట్ల మధ్య దుబాయ్ వేదికగా మ్యాచ్ జరగనుంది. భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 2.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి సెమీఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించి.. టీమిండియా ఫైనల్ చేరింది. రెండో సెమీస్లో దక్షిణాఫ్రికాను మట్టికరిపించి కివీస్ ముందడుగు వేసింది. దీంతో ఈ రెండు జట్లూ టైటిల్కు అడుగు దూరంలో నిలిచాయి.
నిజానికి ప్రపంచ క్రికెట్లో న్యూజిలాండ్ను దురదృష్టమైన జట్టుగా పిలుస్తుంటారు. చాలా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు నాకౌట్ స్టేజ్లలోనే ఇంటి బాట పట్టడం అందుకు కారణం. ముఖ్యంగా 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో ఇంగ్లాండ్ చేతిలో వెంట్రుకవాసిలో ఆ జట్టు ఓడిపోయింది. అయినా.. చాలా ఐసీసీ టోర్నీల్లో ఆ జట్టు సెమీ ఫైనల్ వరకూ వచ్చింది. ఏ ఒక్కరు.. ఇద్దరు ప్లేయర్లపైన ఆధారపడకుండా జట్టులోని ఆటగాళ్లంతా సమష్టిగా రాణించడం ఆ జట్టు నైజం.
ఇక న్యూజిలాండ్ ఇప్పటివరకు రెండు ఐసీసీ టైటిల్స్ సాధించింది. అయితే ఆ రెండూ కూడా భారత్ను ఓడించే గెలుచుకోవడం గమనార్హం. 2000 సంవత్సరంలో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ (అప్పుడు నాకౌట్ టోర్నీ అని పిలిచేవారు) ఫైనల్లోనూ ఆ జట్టు భారత్ను ఓడించింది. ఆ తర్వాత 21 ఏళ్ల విరామం తర్వాత ఆ జట్టు ఖాతాలో మరో ఐసీసీ టైటిల్ వచ్చి చేరింది. అదే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్. 2021లో జరిగిన తొలి ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ కివీస్.. భారత్ను ఓడించింది.
మరోవైపు ఐసీసీ టోర్నీల్లో న్యూజిలాండ్పై కెప్టెన్ రోహిత్ శర్మకు తిరుగులేని రికార్డ్ ఉంది. ఇప్పటి వరకూ రోహిత్ సారథ్యంలోని భారత జట్టు ఐసీసీ టోర్నీల్లో కివీస్ చేతిలో ఓడిపోలేదు.ఈ నేపథ్యంలో ఈసారి మ్యాచ్ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. ఐసీసీ నాకౌట్ మ్యాచులలో తేలిపోయే అలవాటు ఉన్న కివీస్.. భారత్తో మ్యాచ్ అంటే మాత్రం చెలరేగిపోతుంది. కానీ ప్రస్తుత టోర్నీల్లో కివీస్.. ఇదివరకే లీగ్ స్టేజ్లో భారత్ చేతిలో ఒక మ్యాచ్ ఓడిపోయింది. గతేడాది టీ20 ప్రపంచకప్ టైటిల్ గెలిచిన భారత్.. న్యూజిలాండ్ను ఓడించి.. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరి ఈ మ్యాచ్లో గెలిచి.. రెండు ఫైనల్ల ఓటములకు భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా? వరుసగా మూడో ఫైనల్లో భారత్ను న్యూజిలాండ్ ఓడిస్తుందా? అన్నది తేలాల్సి ఉంది. న్యూజిలాండ్, కెప్టెన్ రోహిత్ శర్మల్లో.. ఎవరిది పై చేయి కానుందనేది ఆదివారం తేలనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa