ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అప్పుల పేరుతో కూటమి పార్టీలు చేసిన కుట్రపూరిత ప్రచారం బట్టబయలు అయ్యింది

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Mar 08, 2025, 09:36 AM

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో అప్పులపై కూటమి పార్టీలు చేసిన తప్పుడు ప్రచారం వ్యవస్థీకృత నేరమేనని మాజీ మంత్రి సాకె శైలజానాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందంటూ పచ్చి అబద్దాలతో ఆడిన కూటమి పార్టీలు ఇప్పటి వరకు సాగించిన నాటకం బట్టబయలైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అప్పులపై పదేపదే అబద్దాలతో ప్రజలను వంచించిన వైనం ఇప్పుడు వెలుగుచూసిందని అన్నారు. అయన మాట్లాడుతూ.... ఎన్నికలకు ముందు అబద్దాలతో ప్రజలను మోసం చేసిన కూటమి పార్టీలు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా అవే అబద్దాలను కొనసాగిస్తున్నాయి. ఎన్నికలకు ముందు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరీలు రాష్ట్రంలో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని, ఏపీ అప్పుల కుప్పగా మిగిలిపోతోంది, మరో శ్రీలంకగా మారిపోతోందంటూ పెద్ద ఎత్తున విష ప్రచారం చేశారు. ఏపీని కూడా శ్రీలంకలా దివాలాతీసినట్లు ప్రకటిస్తారా అంటూ ఆనాటి సీఎం వైయస్ జగన్ ను ప్రశ్నించారు. అప్పుల విషయంలో లేనిదానిని ఉన్నట్లుగా ప్రజలకు భ్రమలు కల్పించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై దుర్మార్గంగా మాట్లాడారు. చంద్రబాబు అనేక సందర్భాల్లో మాట్లాడుతూ రూ.12 లక్షల కోట్లు వైయస్ జగన్ గారి ప్రభుత్వం అప్పులు చేసిందని అన్నారు. తరువాత రూ. 12.8 లక్షల కోట్లు అని మరోసారి అన్నారు. ఆ తరువాత కాదు.. కాదు.. రూ.14 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ మరోసారి ఆరోపించారు. ఈ రాష్ట్రానికి అసలు అప్పులే పుట్టవు అంటూ శాపనార్థాలు పెట్టారు. ఈనాడు పత్రికలో మహేంద్రదేవ్ అనే వ్యక్తిని తీసుకువచ్చి, ఆర్థికనిపుణుడు అనే పేరుతో ఇప్పించిన విశ్లేషణలో కూడా రూ.14 లక్షల కోట్ల అప్పులు అంటూ చెప్పించారు. పవన్ కళ్యాణ్ కూడా ఇదే తరహాలో 17.5.2022లో మాట్లాడుతూ శ్రీలంక ఆర్థిక పరిస్థితికి కూతవేటు దూరంలోనే ఏపీ ఆర్థిక వ్యవస్త ఉందటూ పచ్చి అబద్దాలు చెప్పారు. అప్పులతో ఆంధ్రా పేరును మారు మ్రోగిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ పవన్ కళ్యాణ్ వ్యంగ్య వ్యాఖ్యలు కూడా చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరీ ఏకంగా రూ.11 లక్షల కోట్లు అప్పులు చేశారంటూ వైయస్ఆర్‌సీపీపై నిందలు మోపారు. ఈ అప్పులపై ఆనాటి కేంద్రమంత్రి దీనిపై అసలు వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తే, వెంటనే ఆమె తమ మరిది చంద్రబాబు తరుఫున హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి సదరు కేంద్రమంత్రిని కలిసి మీ లెక్కలు తప్పు అంటూ అబద్దాలను వైయస్ఆర్సీపీ పైన రుద్దేందుకు ప్రయత్నించారు అని తెలిపారు. ఇప్పటి వరకు అప్పుల పేరుతో కూటమి పార్టీలు చేసిన కుట్రపూరిత ప్రచారం బట్టబయలు అయ్యింది. అసెంబ్లీలో వెల్లడించిన అధికారిక వివరాల ప్రకారం వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి అంటే మార్చి 2024 వరకు ప్రభుత్వ అప్పులు రూ.4,91,734 కోట్లు, అలాగే ప్రభుత్వ గ్యారెంటీ అప్పులు రూ. 1,54,797 కోట్లు. అంటే మొత్తం రూ.6,46,531 కోట్లు అప్పులు ఉన్నాయని అధికారికంగా లిఖిత సమాధానం ఇచ్చారు. అంటే ఇప్పటి వరకు  రూ.14 లక్షల కోట్లు అంటూ చేసినవన్నీ అబద్దాలేనని తేలిపోయింది అని అన్నారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa