ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో..టన్నెల్‌ నుంచి మృతదేహం వెలికితీత

Crime |  Suryaa Desk  | Published : Sun, Mar 09, 2025, 10:14 PM

నాగర్‌కర్నూల్‌ జిల్లా దోమలపెంట సమీపంలోని శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్‌ ప్రమాదం ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 8 మంది లోపలే ఇరుక్కుపోగా.. వారిని గుర్తించేందుకు 16 రోజులుగా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఈ రెస్క్యూ ఆపరేషన్‌లో కీలక పురోగతి చోటుచేసుకుంది. టన్నెల్‌ లోపల మృతదేహాన్ని గుర్తించిన రెస్క్యూ సిబ్బంది.. దాన్ని బయటకు తీసుకొచ్చారు. టన్నెల్ బోరింగ్ మిషన్ ముందు.. ఈ మృతదేహాన్ని గుర్తించారు. పూర్తిగా కుళ్లిపోయి, నుజ్జు నుజ్జయిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించగా.. అది రాబిన్స్ కంపెనీ ఎరక్టర్ గురుప్రీత్ సింగ్‌దేనని తేల్చారు. బయటకు తీసుకొచ్చిన మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం.. నాగర్ కర్నూల్ జనరల్ ఆసుపత్రికి తరలించారు.


అయితే.. ప్రమాదం జరిగిన రోజు నుంచి 16 రోజులుగా అహర్నిశలూ.. రకరకాల మార్గాల్లో రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తూనే ఉన్నారు. కాగా.. లోపల గుట్టలుగా పేరుకుపోయిన మట్టి, నీటి ఉట రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయంగా మారింది. అయినప్పటికీ.. ఏమాత్రం వెనకడుగు వేయకుండా లోపల ఉన్న వారిని ప్రాణాలతో బయటకు తీసుకొచ్చేందుకు వీలైనన్ని మార్గాల్లో ప్రయత్నించినా లాభం లేకపోయింది. రోజులు గడుస్తున్నాకొద్దీ.. లోపల ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఇరుక్కుపోయిన 8 మంది ప్రాణాలతో ఉండే అవకాశం లేదని అధికారులు తేల్చటంతో.. ప్రభుత్వం కూడా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.


అప్పటి నుంచి.. కనీసం వారి మృతదేహాలైనా బయటకు తీసుకురావాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే.. కేరళ నుంచి రప్పించిన కేడావర్ డాగ్స్.. మృతదేహాలు ఉన్న చోటును గుర్తించినట్టు అధికారులు చెప్పారు. సొరంగంలో ప్రమాదం జరిగిన 100 మీటర్ల దూరంలో డి-2 పాయింట్‌లో మనుషుల ఆనవాళ్లను కేరళ జాగిలాలు గుర్తించాయని తెలిపారు.


జాగిలాలు గుర్తించిన ప్రాంతంలో తవ్వకాలు చేపట్టిన కార్మికులకు 6 అడుగుల లోతులో ఓ వ్యక్తికి చెందిన కుడి చేయి కనిపించింది. దీంతో అప్రమత్తమైన కార్మికులు ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని వెలికి తీసేందుకు దాని చుట్టూ గొయ్యి తవ్వి.. చివరికి మృతదేహాన్ని బయటకు తీసుకొచ్చారు. కాగా.. మిగిలిన ఏడుగురి మృతదేహాలు కూడా త్వరలోనే గుర్తించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa