ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవిలో ఆ నలుగురు.. ఎంజాయ్ చేద్దామని వెళ్తే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 10:06 PM

దారంతా చీకటి.. ఎటు వెళ్తున్నామో తెలియడం లేదు. ఒళ్లంతా చెమట్లు పడుతున్నాయి, గుండెల్లో దడ పెరుగుతోంది. గుండె కొట్టుకునే చప్పుడు చెవుల్లో ధ్వనించేంత నిశ్శబ్దం. కీచురాళ్ల అరుపులతో వెన్నులో వణుకు పుడుతోంది. ఎందుకు వచ్చాంరా దేవుడా అనిపిస్తోంది.. గట్టిగా పిలిచినా ఒక్క నర మానవుడూ పలకడాయె. ఇదేం దరిద్రమో.. చిన్నప్పుడు చూసిన దెయ్యం సినిమాలన్నీ ఇప్పుడే గుర్తుకు వచ్చి చావాలా.. ఆ చీకట్లో నల్లగా.. అమ్మో అదేంటది.. కొంపదీసి క్రూర జంతువైతే కాదు కదా.. వేగంగా అడుగులు ముందుకు వెళ్తున్నా., వెనుక నుంచి ఎవరో మీదపడినట్లుగా భయం.. స్వామీ.. ఈ రాత్రి త్వరగా తెల్లారేలా చూడు, మమ్మల్ని కాపాడు. ఇంతలో దూరంగా ఏదో సైరన్ చప్పుడు, లైట్ల వెలుతురు కనిపించింది. లోనుంచి ఏదో ఆశ తన్నుకు వచ్చింది.హెల్ప్.. హెల్ప్.. గట్టిగా కేకలు పెడుతూ ఆ నలుగురు యువకులు అటుగా పరుగులు తీశారు. ఆ లైట్ల వెలుతురు చేరగానే హమ్మయ్యా అంటూ గట్టిగా ఊపిరి పీల్చుకున్నారు..


ఇదేమీ హారర్ సినిమా స్టోరీ కాదు.. నలుగురు యువకుల స్వీయానుభవం. ఎంజాయి చేద్దామని వెళ్లి, అడవిలో ఇరుక్కుపోయి, ఎటుపోవాలో పాలుపోని పరిస్థితుల్లో వారు పడిన భయం, ఆందోళన.. ఈ ఘటన ఎన్టీఆర్ జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..విజయవాడకు చెందిన జస్వంత్, అభిషేఖ్, కృపా కిషోర్, పాల్ అనే నలుగురు యువకులు. మంచి స్నేహితులు.. వీకెండ్ కావటంతో శనివారం అలా బయటకు వెళ్లి ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేశారు. అలా ఎన్టీఆర్‌ జిల్లాలోని కొండపల్లి ఖిల్లాకు వెళ్లి కొద్దిసేపు సరదాగా గడిపి వద్దామని అనుకున్నారు. ప్లాన్ ప్రకారం శనివారం కొండపల్లి ఖిల్లాకు వెళ్లారు. అక్కడే పొద్దుపోయేవరకు ఉన్నారు. చీకటి పడుతుందనగా తిరిగి వెనక్కి బయల్దేరారు. అయితే నలుగురు యువకులు ఘాట్‌ రోడ్డులోకి రాకుండా దారి తప్పారు. కొంత దూరం వెళ్లాక కానీ దారి తప్పినట్లు తెలియలేదు. అయితే అప్పటికే చీకట్లు పడ్డాయి. ఎటు చూసినా చీకటి.. దారి కనిపించలేదు.దీంతో గట్టిగా కేకలు వేశారు.


కానీ ప్రయోజనం శూన్యం. ఎటువైపు నుంచి ఎలాంటి స్పందనా లేదు. దీంతో నలుగురు యువకులు భయపడిపోయారు. సాయం కోసం వెంటనే 112కి ఫోన్‌ చేశారు. దీంతో యువకులు తప్పిపోయినట్లు గుర్తించిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. కొండపల్లి ఖిల్లా వద్దకు చేరుకుని యువకుల కోసం వెదుకులాట ప్రారంభించారు. గూగుల్‌ మ్యాప్‌ ద్వారా వారు ఎక్కడ ఉన్నదీ గుర్తించారు. సైరన్, డ్రాగన్‌లైట్లతో ఎట్టకేలకు వారిని గుర్తించారు. అలా వారిని ఘాట్ రోడ్డుపైకి తీసుకువచ్చిన ఇబ్రహీంపట్నం పోలీసులు.. పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. తెల్లవారే వరకూ పోలీస్ స్టేషన్‌లో ఆశ్రయం కల్పించారు. తెల్లవారిని తర్వాత విజయవాడకు పంపించడంతో ఆ యువకులు బతుకు జీవుడా అంటూ బయటపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com