దుబాయి నుంచి అక్రమంగా బంగారం రవాణా చేస్తూ విమానాశ్రయంలోనే పోలీసులకు పట్టుబడిన నటి రన్యారావు కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ముఖ్యంగా డీఆర్ఐ అధికారులు కస్టడీకీ తీసుకుని తనని వేధించారని చెప్పింది. ఇప్పటికే అధికారులు శారీరకంగా వేధించారంటూ వార్తలు రాగా.. వాటిల్లో సత్యం లేదని, నటిపై ఉన్న గాయాలు పాతవని వివరించారు. అవును అది నిజమేనన్న రన్యారావు.. అధికారులు తనను కొట్టకపోయినా మాటలతో హింసిస్తున్నారని వెల్లడించారు. కొన్ని కాగితాలపై సంతకాలు చేయమని ఇబ్బంది పెడుతున్నారని.. మాటలతో చిత్రవధ చేస్తున్నారని నేరుగా కోర్టుకు చెప్పింది. ఆ పూర్తి వివరాలు మీకోసం.
దుబాయి నుంచి 14.2 కిలోల బంగారాన్ని దుస్తుల్లో దాచుకుని అక్రమంగా తరలిస్తుండగా భద్రతా అధికారులు నటి రన్యారావును పట్టుకున్నారు. తరచూ దుబాయి వెళ్లడం అందులోనూ ఒకే రకమైన దుస్తులు ధరిస్తుండటంతో అధికారులకు అనుమానం వచ్చి ఆమెపై నిఘా పెట్టి ఆమెను తనిఖీ చేయగా బంగారం స్మగ్లింగ్ వ్యవహారం బయటపడింది. ఆ తర్వాత ఆమె ఇంట్లోనూ సోదాలు చేయగా.. 14.2 కిలోల బంగారు బిస్కెట్లు, మరో రూ.2.67 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆపై కోర్టులో హాజరు పరిచారు.
అయితే కోర్టు ముందు ఏడుస్తూ.. ఎలాంటి సమాధానాలు చెప్పని రన్యారావు ఈరోజు విచారణలో మాత్రం నోరు విప్పారు. ముఖ్యంగా డీఆర్ఐ అధికారులు.. విచారణ సమయంలో రన్యారావు నోరు మెదపడం లేదని చెప్పారు. ఆమెను తాము ఏరకంగానూ వేధించడం లేదని పేర్కొన్నారు. కోర్టుకు రాగానే ఆమె ఎలా మాట్లాడాలో లాయర్లు సూచిస్తున్నారని.. ఆమె అదే ఫాలో అవుతూ తమకు సహకరించడం లేదని చెప్పుకొచ్చారు. అంతేకాకుండా తమ దర్యాప్తు ప్రక్రియ మొత్తాన్ని రికార్డు చేసినట్లు వెల్లడించారు.
కానీ దీనిపై రన్యారావు స్పందిస్తూ.. తాను దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తున్నట్లు వెల్లడించింది. కానీ అధికారులే కొన్ని పేపర్లపై సంతకం చేయమని తనను వేధిస్తున్నారని వివరించింది. తన ఇంటిని కావాలని మ్యాపింగ్ చేస్తూ, గుర్తు తెలియని ప్రాంతాలకు తీసుకెళ్లి మరీ చెప్పినట్లు వినాలని ఇబ్బంది పెడుతున్నారని పేర్కొంది. ఒట్టేసి చెబుతున్నా వారిలాగే ప్రవర్తిస్తున్నారనంటూ కోర్టు ముందు వాపోయింది. ఆమె వాదనలు విన్న న్యాయమూర్తి మీ న్యాయవాదితో మాట్లాడేందుకు 30 నిమిషాల సమయం ఇచ్చాం.. ఆయా వేధింపుల గురించి వివరించి పిటిషన్లు వేయమని చెప్పారు.
అయితే డీఆర్ఐ అధికారుల తరఫున వాదిస్తున్న న్యాయవాది ఆరోపణలను ఖండించారు. దర్యాప్తుకు సంబంధించిన పూర్తి వీడియో తమ వద్ద ఉందని.. కావాలనే నటి కేసును తప్పుదోవ పట్టిస్తుందని వెల్లడించారు. ఇరువురి వాదనలు విన్న న్యాయమూర్తి నటి రన్యారావుకు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ.. ఆదేశాలు జారీ చేశారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa