ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పట్టపగలే 9మంది దుండగులు.. రూ.25 కోట్ల భారీ చోరీ

Crime |  Suryaa Desk  | Published : Mon, Mar 10, 2025, 10:39 PM

బిహార్‌లో కళ్లు బైర్లుకమ్మే ఘటన ఒకటి చోటు చేసుకుంది. పట్టపగలే రెచ్చిపోయిన దొంగల ముఠా.. ఏకంగా రూ.25 కోట్ల విలువైన సొత్తును ఎత్తుకెళ్లిపోయింది. 9 మంది ఉన్న దొంగల ముఠా.. తనిష్క్ జ్యువెలరీ షోరూమ్‌లోకి ఆయుధాలు, మాస్కులతో ప్రవేశించారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బందిని కొట్టి, అక్కడ ఉన్న నగలతో ఉడాయించారు. అయితే షోరూమ్‌లో ఉన్న సీసీటీవీలో ఆ దొంగతనానికి సంబంధించిన వీడియోలు రికార్డ్ కాగా.. ఇప్పుడు ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


ఆరా ప్రాంతంలో ఉన్న తనిష్క్ గోల్డ్ షోరూమ్‌ను దాని యజమాని.. ఎప్పటిలాగే ఇవాళ(సోమవారం) కూడా ఉదయం 10 గంటలకు తెరిచారు. అయితే ఆ తర్వాత కొద్దిసేపటికే 9 మంది గుర్తు తెలియని వ్యక్తులు.. షోరూంలోకి చొరబడ్డారు. వారు హెల్మెట్, మంకీ క్యాప్‌లు ధరించి.. చేతుల్లో తుపాకులు పట్టుకుని.. పక్కా ప్లాన్ ప్రకారం.. ఆ గోల్డ్ షోరూంలోకి దూరారు. అనంతరం అక్కడ ఉన్న సిబ్బంది, కస్టమర్లపై తుపాకీలు గురిపెట్టి భయపెట్టారు. దీంతో వారంతా బిక్కుబిక్కుమంటూ భయాందోళనకు గురయ్యారు. ఈ చోరీలో దాదాపు రూ.25 కోట్ల విలువైన బంగారం, ఇతర విలువైన ఆభరణాలు చోరీకి గురైనట్లు సంబంధిత షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.


తనిష్క్ షోరూంలోని నగలను అపహరించే క్రమంలో అక్కడ ఉన్న సిబ్బందిలో ఒకరిపై దుండగులు దాడి చేశారు. దీంతో కొద్దిసేపు ఆ షోరూంలో దుండగులు నానా బీభత్సం సృష్టించారు. అనంతరం భారీగా ఆభరణాలను చోరీ చేసి.. వారు అక్కడి నుంచి పరారయ్యారు. వెంటనే తనిష్క్ గోల్డ్ షోరూం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగి సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అయితే పోలీసులు వచ్చేసరికే అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు.


ఇక నిందితులను పట్టుకునేందుకు వారిని వెంబడిస్తూ వెళ్లిన పోలీసులు.. దుండగులపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు నిందితులకు గాయాలు అయినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ చోరీలో షోరూంలోని బంగారం, వెండి, ఇతర ఆభరణాలే కాకుండా డబ్బును కూడా నిందితులు ఎత్తుకుపోయినట్లు షోరూం మేనేజర్ పోలీసులకు వివరించాడు. అయితే కాజేసిన డబ్బు ఎంత ఉంటుంది అనేది ఇంకా తెలియాల్సి ఉందని తెలిపాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి గాలింపు చేపట్టారు.


అయితే ఓ వైపు నిందితులు షోరూంలో ఆభరణాలు చోరీ చేస్తున్న సమయంలోనే వారికి తెలియకుండా సిబ్బంది పోలీసులకు ఫోన్‌ చేసినట్లు వివరించారు. అయితే 25 నుంచి 30 సార్లు పోలీసులకు ఫోన్ చేసినట్లు చెప్పారు. దొంగతనం జరిగిన షోరూమ్‌కు 600 మీటర్ల దూరంలోనే పోలీస్‌ స్టేషన్‌ ఉన్నప్పటికీ.. వారు సమయానికి ఫోన్ ఎత్తలేదని.. అక్కడికి రాలేదని షోరూం సిబ్బంది తీవ్ర ఆరోపణలు చేశారు. పోలీసులు సరైన సమయానికి ఫోన్ ఎత్తి.. సంఘటనా స్థలానికి చేరుకుంటే ఆ దొంగల ముఠాను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకునేవాళ్లని వాపోతున్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa