విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు చెల్లించాలంటూ వైసీపీ యువత పోరు పేరుతో ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో యువత పోరు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థులు, తల్లిదండ్రులు, నిరుద్యోగులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా వైఎస్ జగన్ ట్వీట్ చేశారు. అలాగే యువత పోరు పేరిట ప్రజాస్వామ్యయుతంగా చేపట్టిన నిరసనలపై పోలీసుల దౌర్జన్యాలను ఖండిస్తున్నట్లు జగన్ తెలిపారు. పలుచోట్ల పోలీసులతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవాలని చూసినా.. విద్యార్థులు, పోలీసులు గట్టిగా గళమెత్తారని ప్రశంచించారు. చంద్రబాబుకు నిరుద్యోగులు, విద్యార్థులు పంపిన తొలి హెచ్చరిక అంటూ జగన్ పేర్కొన్నారు.
పేదరికం వలన విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే కారణంతో వైసీపీ ప్రభుత్వం విద్యాదీవెన ద్వారా సంపూర్ణ ఫీజు రీయింబర్స్మెంట్ను, వసతి దీవెన ద్వారా హాస్టల్, మెస్ ఛార్జీలను విద్యార్థుల తల్లులు,పిల్లల ఖాతాలకే జమచేసిందని జగన్ గుర్తుచేశారు. వైసీపీ అమలు చేసిన పథకాలను కూటమి ప్రభుత్వం పూర్తిగా నీరుగార్చిందని జగన్ విమర్శించారు. చంద్రబాబు గత పాలనలోని ఆ చీకటి రోజులనే మళ్లీ తీసుకువచ్చారని జగన్ ఆరోపించారు.
"2024 జనవరి - మార్చి త్రైమాసికానికి సంబంధించిన ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బును ఏప్రిల్లో వెరిఫై చేసి, మేలో చెల్లించాల్సి ఉంది. అక్కడ నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ కింద ప్రతి త్రైమాసికానికి రూ.700 కోట్ల చొప్పున ఏడాదికి రూ.2,800 కోట్లు ఇవ్వాలి. వసతి దీవెన కింద హాస్టల్ ఖర్చులకు మరో రూ.1,100 కోట్లు ఇవ్వాలి. ప్రతి ఏడాదికి ఈ రెండు పథకాలకు రూ.3,900 కోట్లు ఖర్చు చేయాలి. కానీ చంద్రబాబుగారూ, మీరిచ్చింది కేవలం రూ. 700 కోట్లు. అదికూడా ఇప్పటికీ పూర్తిగా పిల్లలందరికీ చేరలేదు. అంటే గతేడాది పిల్లలకు బాకీ పెట్టిన రూ.3,200 కోట్లు, అదీ కాక ఈ ఏడాది ఖర్చుచేయాల్సిన మరో రూ. 3,900 కోట్లు, రెండూ కలిపితే రూ.7,100 కోట్లు ఈ సంవత్సరం ఖర్చుపెట్టాలి. అయితే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టింది కేవలం రూ.2,600 కోట్లు మాత్రమే. " అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
మరోవైపు తాము అధికారంలోకి వస్తే 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని.. అప్పటి వరకూ నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని జగన్ పేర్కొన్నారు. ఉద్యోగాలు ఇవ్వడం లేదు కదా.. వైయస్ఆర్సీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను ఊడపీకుతున్నారని జగన్ ఆరోపించారు. నిరుద్యోగ భృతి ఇవ్వాలంటే ఏటా రూ.7,200 కోట్లు ఖర్చు చేయాలన్న జగన్.. ఏపీ ప్రభుత్వం బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేదని మండిపడ్డారు. ఈ రెండేళ్లలోనే ప్రతి నిరుద్యోగికీ రూ.72 వేల చొప్పున బకాయి పడ్డారంటూ వైఎస్ జగన్ విమర్శించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa