ఉత్తర ప్రదేశ్లోని షాజహాన్పూర్లో హోలీ వేడుకలను చాలా ఘనంగా జరుపుకుంటారు. ముఖ్యంగా "జూత మార్ హోలీ" పేరుతో ఓ ఊరేగింపు చేస్తారు. 10 కిలో మీటర్ల మేర సాగే ఈ కార్యక్రమంలో హిందువులు పాల్గొని పెద్ద ఎత్తున రంగులు చల్లుకుంటారు. వేలాది మంది ఇక్కడకు వచ్చి ఫుల్లుగా ఎంజాయ్ చేస్తుండగా.. చాలా సార్లు గొడవలు చెలరేగాయి. అయితే ఈ ఏడాది ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు షాజహాన్పూర్ యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంటోంది. ముఖ్యంగా భారీ బందోబస్తు చేపట్టబోతుంది.
అయితే అదే రోజు రంజాన్ మాసపు రెండో పవిత్ర శుక్రవారం వస్తుండగా.. ముస్లిం ప్రజలు కూడా ప్రార్థనల కోసం పెద్ద ఎత్తున మసీదుకు వెళ్తారు. పొరపాటున వారిపై రంగులు పడితే ఇరు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం ఎక్కువగా ఉన్నందుకు అధికార యంత్రాంగం.. ఇరు వర్గాల మత పెద్దలతో చర్చలు జరిపింది. ముఖ్యంగా మసీదులపై రంగులు పడకుండా ఉండాలంటే.. వాటిని టార్ఫాలిన్ కవర్లతో కప్పేయాలని నిర్ణయించింది. కొన్ని గంటల పాటు సాగిన చర్చల అనంతరం ముస్లిం మత పెద్దలు ఈ నిర్ణయానికి ఓకే చెప్పారు.
దీంతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగి రంగు రంగుల టార్ఫాన్ కవర్లతో దాదాపు 60కి పైగా మసీదులను కప్పేసింది. ఈక్రమంలోనే షాజహాన్పూర్ ఎప్సీ రాజేష్ ఎస్.. మాట్లాడుతూ.. దీని వల్ల రెండు వర్గాల మధ్య గొడవలు జరిగే అవకాశం చాలా తక్కువగా ఉంటుందని.. శాంతి కోసం మాత్రమే తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
అటు హిందువులతో పాటు ముస్లింలు కూడా తమ పండుగలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. అలాగే ముస్లిం ప్రజల సహకారం ప్రశంసనీయం అన్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు భారీ బందోబస్తుతో పాటు డ్రోన్లు, కెమెరాలు కూడా వాడతామన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa