ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సమ్మెకు దిగనున్న ఉద్యోగులు.. బ్యాంక్ సేవలకు అంతరాయం

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 14, 2025, 10:40 PM

 బ్యాంకు ఉద్యోగుల సమ్మె మార్చి 24-25 తేదీల్లో జరగనుంది. యూనియన్ ఆఫ్ బ్యాంక్స్ (UFBU).. ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. బ్యాంక్ యూనియన్ల డిమాండ్లను IBA అంగీకరించలేదు. దీంతో సమ్మె నిర్ణయం తీసుకున్నారు. పలు పోస్టుల భర్తీ సహా ఐదు రోజుల పని దినాలు వంటి ముఖ్యమైన విషయాలపై UFBU.. ఐబీఏతో చర్చలు జరిపింది. కానీ ఏకాభిప్రాయం రాలేదు. ''ఈ విషయాలపై ఎలాంటి పరిష్కారం రాలేదు." అని నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్  జనరల్ సెక్రటరీ ఎల్. చంద్రశేఖర్ చెప్పారు. దీంతో ముందుగా ప్రకటించినట్లుగానే రెండు రోజుల పాటు సమ్మె కొనసాగుతుందని స్పష్టం చేశారు. సమ్మె విజయవంతం అయితే.. బ్యాంకు ఉద్యోగులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉండొచ్చు.


ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగులు, అధికారుల పోస్టులను భర్తీ చేయాలని యూఎఫ్బీయూ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. పనితీరు సమీక్షలు, పనితీరు ఆధారిత ప్రోత్సాహకాలకు సంబంధించి ఇటీవల జారీ చేసిన ఉత్తర్వుల్ని ఉపసంహరించుకోవాలని కూడా కోరుతోంది. ఇవి ఉద్యోగ భద్రతకు ముప్పుగా ఉన్నాయని వారు ఆరోపిస్తున్నారు. యూఎఫ్బీయూలో ఆల్ ఇండియా బ్యాంక్ ఎంప్లాయీస్ అసోసియేషన్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ కాన్ఫెడరేషన్ , నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ బ్యాంక్ ఎంప్లాయీస్ , ఆల్ ఇండియా బ్యాంక్ ఆఫీసర్స్ అసోసియేషన్ వంటి ప్రధాన బ్యాంకు యూనియన్లు ఉన్నాయి.


ప్రస్తుతం ఎల్ఐసీ సహా ఇతర ప్రధాన ప్రభుత్వ కంపెనీల్లో ఉద్యోగులకు వారానికి 5 రోజుల పనే ఉంది. ఈ క్రమంలోనే బ్యాంక్ ఉద్యోగులు కూడా తమకు 5 రోజుల పనే కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. అప్పట్లో దీనిపై అంగీకారం తెలిపినట్లే వార్తలొచ్చినా.. అధికారికంగా ప్రకటన రాలేదు. ఇక ఈ సమ్మె వల్ల బ్యాంకింగ్ సేవలు ప్రభావితం అవుతాయని చెప్పొచ్చు. ఎక్కువ మంది ఉద్యోగులు సమ్మెలోనే ఉండనున్నారు.


ముఖ్యంగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవడం అంటే ఇక్కడ ఏటీఎంలో నగదు కొరత ఏర్పడే అవకాశం ఉంది. చెక్కుల క్లియరెన్స్ సహా డిపాజిట్లు వంటి సేవల్లోనూ అంతరాయం కలిగే అవకాశం ఉంది. సమ్మె కారణంగా ప్రజలకు కొంత అసౌకర్యం కలుగుతుంది. యూఎఫ్బీయూ, ఐబీఏ మధ్య మళ్లీ చర్చలు జరిగి.. సమస్య పరిష్కారం అయ్యే అవకాశం కూడా ఉంది. ఏదేమైనా.. సమ్మె నేపథ్యంలో కస్టమర్లు.. తమ బ్యాంకింగ్ పనుల్ని ముందుగానే పూర్తి చేసుకోవడం మంచిది. మార్చి 24, 25 సోమ, మంగళవారాలు కాగా.. అంతకుముందు మార్చి 22,23 వరుసగా నాలుగో శనివారం, ఆదివారం కావడంతో.. వరుసగా 4 రోజుల పాటు బ్యాంక్ సర్వీసులపై ఎఫెక్ట్ పడనుందని చెప్పొచ్చు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com