ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రన్యా రావు బంగారం స్మగ్లింగ్ కేసులో మరో ట్విస్ట్.. సవతి తండ్రికి ప్రభుత్వం షాక్

national |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:48 PM

కన్నడ బ్యూటీ రన్యా రావు బంగారం అక్రమ రవాణా వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. విదేశాల నుంచి బెంగళూరుకు బంగారం తరలించడానికి పోలీసు అధికారుల ‘ప్రోటోకాల్‌’ సేవలు వినియోగించుకున్నట్టు డైరెక్టరేట్ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టుకు సమాచారం అందించారు. పోలీసులు, ప్రముఖల సహకారం, మద్దతుతోనే రన్యా రావు ఈ ఏడాది జనవరి నుంచి 27 సార్లు దుబాయ్‌కు వెళ్లి వచ్చిందని కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి విశ్వనాథ్‌ సి.గౌడర్‌ ఆమెకు బెయిలు నిరాకరించారు.


కాగా, ఈ వ్యవహారంలో ఆమె సవతి తండ్రి, పోలీస్ ఉన్నతాధికారి రామచంద్ర రావును తప్పనిసరి లీవ్‌పై కర్ణాటక ప్రభుత్వం పంపింది. అయితే, డీజీపీ రామచంద్రరావును (పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్)‌ సెలవుపై పంపడానికి గల కారణం మాత్రం సిద్ధరామయ్య ప్రభుత్వం వెల్లడించలేదు. అయితే, తన సవతి కుమార్తె రన్యా రావు స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడటంపై సీనియర్ ఐపీఎస్ రామచంద్రరావు విస్మయం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా తన నోటీసుకు వచ్చిందని, ఆమె ఇలాంటి పనులు చేస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదని అన్నారు. ఇంతకంటే మాట్లాడటానికి ఏమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఆమె ఇప్పుడు తమ ఇంట్లో లేదని, భర్తతో కలిసి ఉంటోందని చెప్పారు.


ఇదిలా ఉండగా, రన్యా రావు మాత్రం బంగారం అక్రమ రవాణాకు తన సవతి తండ్రి అధికారాన్ని ఉపయోగించుకున్నట్టు ప్రాథమిక విచారణలో వెల్లడయ్యింది. విమానాశ్రయంలో చెకింగ్ పాయింట్ల వద్ద తాను డీజీపీ కుమార్తెనని చెప్పి తప్పించుకున్నట్టు తెలింది. 15 రోజుల వ్యవధిలోనే ఆమె నాలుగుసార్లు దుబాయికి వెళ్లి రావడంతో డీఆర్ఐ అధికారులు అనుమానించారు. దీంతో మార్చి 3న ఆమె దుబాయ్ నుంచి వస్తుండగా కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో 12.56 కిలోల బంగారంతో అడ్డంగా దొరికిపోయింది.


ఇక, ఈ దందా వెనుక స్మగ్లింగ్‌తో పాటు హవాలా లావాదేవీలు, పెద్ద సిండికేట్ల పాత్ర కూడా ఉన్నట్లు డీఆర్‌ఐ భావిస్తోంది. దుబాయ్‌ రెసిడెంట్ వీసా ఉన్న విషయాన్ని రన్యారావు దాచి పెట్టారని, బెయిలు ఇస్తే ఆమె పరారయ్యేందుకు అవకాశం ఉందని కోర్టులో వాదించారు. తమ కస్టడీలో విచారణకు ఆమె సహకరించలేదని స్పష్టం చేశారు. మరోవైపు, విమానాశ్రయంలో వీఐపీ ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు రావడంతో ఈ వ్యవహారంపై కర్ణాటక ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. అటు, ఆమె కస్టడీలో పూటకో మాట మాట్లాడుతోందని డీఆర్ఐ అధికారులు పేర్కొనడం గమనార్హం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa