ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బంధువు అంత్యక్రియలకు వెళ్తుండగా పడవ బోల్తా.. నీళ్లలో మునిగి ముగ్గురి మృతి

Crime |  Suryaa Desk  | Published : Sun, Mar 16, 2025, 07:49 PM

హోలీ పండుగ సందర్భంగా ఫుల్లుగా రంగులు పూసుకున్న ఓ యువకుడు.. స్థానికంగా ఉన్న ఓ నది వద్దకు వెళ్లి అక్కడే స్నానం చేయబోయాడు. కానీ దురదృష్ట వశాత్తు అదే నదిలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే ఈ విషయం తెలుసుకున్న బంధువులు అతడి అంత్యక్రియలకు వెళ్లేందుకు సిద్ధం అయ్యారు. ముఖ్యంగా స్మశానానికి వెళ్లాలంటే నది దాటి వెళ్లాల్సి ఉండగా.. మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బంధువులు రెండు పడవలపై బయలుదేరారు. కానీ నది మధ్యలోకి రాగానే ఓ పడవ బోల్తా పడడంతో బంధువులు అంతా నీళ్లలో పడిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు వారిని కాపాడే ప్రయత్నం చేయగా.. 13 మందిని రక్షించగలిగారు. కానీ మరో ముగ్గురు మాత్రం నీళ్లలో మునిగిపోయి ప్రాణాలు కోల్పోయారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.


ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా రతన్ రంజ్ గ్రామానికి చెందిన 22 ఏళ్ల దినేష్ గుప్తా శుక్రవారం రోజు హోలీ సందర్భంగా స్నేహితులతో కలిసి ఫుల్లుగా ఎంజాయ్ చేశాడు. అందరిపై రంగులు చల్లుతూ.. తనపై కూడా చల్లించుకున్నాడు. అయితే ఇంటికెళ్లి స్నానం చేయడం కంటే పక్కనే ఉన్న నది వద్దకు వెళ్లి స్నానం చేస్తే బాగుంటుందని భావించి అక్కడకు వెళ్లాడు. శారదా నదిలోకి దిగి స్నానం చేయబోయాడు. కానీ దురదృష్ట వశాత్తు అదే నదిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. విషయం గుర్తించిన స్థానికులు అతడి మృతదేహాన్ని బయటకు తీశారు.


అయితే ఈరోజు ఉదయం దినేష్ గుప్తా అంత్యక్రియల కోసం ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా శ్మశానం నది అవతల ఉండగా.. మృతదేహాన్ని తీసుకుని కుటుంబ సభ్యులు, బందువులు రెండు పడవలపై ప్రయాణం అయ్యారు. మొదటి పడవలో మృతదేహంతో పాటు ఆయనక కుటుంబ సభ్యులు, కొందరు బంధువులు వెళ్లగా.. రెండో పడవలో మొత్తంగా 16 మంది బంధువులు వెళ్లారు. అయితే నది మధ్యలోకి వెళ్లిన తర్వాత రెండో పడవ బోల్తా పడింది. ఫలితంగా అందులో ఉన్న వారంతా నీళ్లలో పడిపోయారు. విషయం గుర్తించిన స్థానికులు, మొదటి పడవలోని వారంతా నీళ్లలో దూకి వారిని కాపాడారు.


మొత్తంగా రెండే ళ్ల చిన్నారి సహా 13 మందిని రక్షించగా.. మరో ముగ్గురు మాత్రం నీళ్లలోనే మునిగి చనిపోయారు. అయితే ప్రాణాలు కోల్పోయిన వారిని 32 ఏళ్ల సంజయ్, 30 సంవత్సరాల కుష్బూ, 13 ఏళ్ల కుంకుమ్‌గా పోలీసులు గుర్తించారు. రెండేళ్ల చిన్నారి ఆరోగ్య పరిస్థితి బాగానే ఉండగా.. మిగతా 12 మంది ప్రస్తుతం స్థానిక ఆరోగ్య కేంద్రంలో ఉండి చికిత్స పొందుతున్నట్లు పోలీసులు వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa