ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సైబర్ నేరగాడి నుంచి రివర్స్‌లో డబ్బులు కొట్టేసిన యువకుడు

national |  Suryaa Desk  | Published : Mon, Mar 17, 2025, 10:43 PM

ప్రేమ పేరుతో కొందరు, మీ పేరిట డ్రగ్స్ పార్సిల్స్ వచ్చాయని మరికొందరు, డిజిటల్ అరెస్టుల పేరుతో ఇంకొందరు అమాయక ప్రజలకు ఫోన్లు చేస్తూ లక్షలు, కోట్లలో డబ్బులు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు. ఇలాగే చేయబోయిన ఓ నేరగాడికే చుక్కలు చూపించాడో యువకుడు. మైనర్ బాలుడిలా నటిస్తూ.. మూడే మూడు ఫోన్ కాల్స్‌తో వారి నుంచే డబ్బులు దొబ్బేశాడు. అలాగే వారి నుంచి డబ్బులు పొందడానికి తాను ఏం కథ చెప్పాడో కూడా వెల్లడించాడు. మరి ఆ స్టోరీ ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందామా.


ఉత్తర ప్రదేశ్‌లోని కన్పూర్‌కు చెందిన భూపేంద్ర సింగ్‌కు సీబీఐ అధికారి పేరిటి ఓ అపరిచిత వ్యక్తి ఫోన్ చేశాడు. మా వద్ద నీ అభ్యంతరక వీడియోలు ఉన్నాయని.. ఈ కేసు మూసేయడానికి రూ.16 వేల రూపాయలు ఇవ్వాలంటూ హెచ్చరించాడు. అయితే ఎలాంటి తప్పు చేయని భూపేంద్ర సింగ్.. ఇదంతా స్కామర్లు చేస్తున్న పనే అని గుర్తించాడు. అలా అని వారిని వదిలేయకుండా.. తిరిగి చుక్కలు చూపించాలనుకున్నాడు. అందుకోసం క్షణాల్లోనే ఓ అద్భుతమైన ప్లాన్ కూడా వేశాడు. ముఖ్యంగా తాను ఓ మైనర్ బాలుడిని అంటూనే.. స్కామర్‌తో ఫోన్ మాట్లాడాడు.


ప్లీజ్ సార్ ఈ వీడియోల గురించి మా అమ్మకు చెప్పొద్దంటూ భూపేంద్ర సింగ్ భయపడిపోయినట్లు నటించాడు. అంతేకాకుండా తన తల్లితో చెప్తే పెద్ద సమస్యలో పడిపోతానంటూ వివరించాడు. దీంతో స్కామర్.. డబ్బులు చెల్లిస్తే ఎవరికీ ఈ విషయం చెప్పనని అన్నాడు. దీంతో భూపేంద్ర కథలు చెప్పడం మొదలు పెట్టాడు. తనకు డబ్బులు అవసరం ఉండి.. తన వద్ద ఉన్న బంగారు గొలుసును తాకట్టు పెట్టానని.. దాన్ని విడిపించడానికి 3 వేల రూపాయలు కావాలని చెప్పాడు. మీరు ఆ డబ్బులు ఇస్తే ఆ చైన్ అమ్మేసి డబ్బులు చెల్లిస్తానని హామీ ఇచ్చాడు.


అది నమ్మిన సైబర్ నేరగాడు ముందుగా భూపేంద్ర సింగ్‌కు 3 వేల రూపాయలు పంపాడు. ఆ తర్వాత రోజు మళ్లీ స్కామర్ ఫోన్ చేయగా.. భూపేంద్ర సింగ్ మరో కథ చెప్పాడు. తాను మైనర్ కావడం వల్ల నగల వ్యాపారి ఆ గొలుసును తాకట్టు నుంచి ఇవ్వడం లేదని.. వివరించాడు. అంతటితో ఆగకుండా మీరే నా తండ్రిలా మాట్లాడితే అతడు గొలుసు ఇస్తాడని అన్నాడు. దీంతో కేటుగాడు అలాగే మాట్లాడతానని చెప్పగా.. భూపేంద్ర సింగ్ తన స్నేహితుడితో నగల వ్యాపారిలా ఫోన్ మాట్లాడించాడు. ఈక్రమంలోనే మిత్రుడు 4,480 రూపాయలు ఇస్తే దాన్ని తిరగిస్తానని వివరించాడు.


అవి చెల్లించాక మళ్లీ ఫోన్ చేస్తే.. ప్రాసెస్ ఫీజు కింద మరో 3 వేలు ఇవ్వాలని.. ఆ గొలుసుపై రూ.1.10 లక్షల రుణం ఇస్తానని చెప్పాడు. ఇలా సైబర్ నేరగాడు మొత్తంగా 10 వేల రూపాయలు చెల్లించాడు. కానీ భూపేంద్ర సింగ్ మాత్రం అతడికి ఎలాంటి డబ్బులు పంపలేదు. ఫోన్ చేసిన ప్రతీ సారి ఇలాగే కథలు చెప్తుండగా.. తాను మోసపోయినట్లు గుర్తించాడు స్కామర్. ఆపై తన డబ్బులు తిరిగి ఇవ్వమంటూ బతిమాలడం ప్రారంభించాడు. కానీ భూపేంద్ర సింగ్ మాత్రం డబ్బులు ఇచ్చేది లేదని తెగేసి చెప్పి నేరుగా పోలీసుల వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.


అయితే స్కామర్ నుంచి తీసుకున్న 10 వేల రూపాయలను తాను విరాళంగా ఇస్తానని భూపేంద్ర సింగ్ వెల్లడించాడు. ప్రజలు కూడా సైబర్ నేరగాళ్లకు భయపడొద్దని.. ఎవరైనా ఫోన్లు చేస్తే ఇలాగే తిరిగి ఆడుకోవాలని వివరించాడు. అది సాధ్యం కాకపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని వివరించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa