తమిళనాడు బడ్జెట్లో రూపాయి సింబల్ను తొలగించి, తమిళ అక్షరం ‘రూ’ను చేర్చడాన్ని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ సమర్దించుకున్నారు. అంతేకాదు, గతంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సైతం తమిళ సింబల్నే వినియోగించారని పేర్కొన్నారు. తమిళ భాష వాడకాన్ని వ్యతిరేకిస్తున్న వారు ఈ అంశాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. ఈ నిర్ణయం తన భాషా విధానం పట్ల తమిళనాడు నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. జాతీయ విద్యావిధానం (ఎన్ఈపీ) అమలుపై కేంద్రం, తమిళనాడు ప్రభుత్వాల మధ్య వివాదం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బడ్జెట్లో రూపాయి సింబల్ను డీఎంకే ప్రభుత్వం తొలగించడం తీవ్ర చర్చనీయాంశమైంది.
స్టాలిన్ ప్రభుత్వ తీరుపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ సహా పలువురు బీజేపీ నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శలకు తమిళనాడు సీఎం స్టాలిన్ తాజాగా కౌంటర్ ఇచ్చారు. ‘‘గతంలో ఓ సందర్భంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ స్వయంగా ఆంగ్లం ‘₹’కి బదులుగా రూపాయి అర్ధాన్ని సూచించే తమిళ ‘రూ’ అక్షరాన్ని వినియోగించారు... మరి ఇప్పుడు మేము కూడా రూ అనే అక్షరాన్ని ఉపయోగించడం సమంజసమే కదా.. భాషపై ప్రస్తుతం జరుగుతున్న వివాదంలో మా వైఖరిని స్పష్టం చేస్తున్నాం.. మా మాతృభాషను కాపాడుకుంటున్నాం.. భాషపై గందరగోళం సృష్టించేందుకు ప్రయత్నాలు చేస్తున్నవారు కేంద్ర మంత్రి చర్యపైనా ఇప్పుడు మాట్లాడండి’’ అని స్టాలిన్ వ్యాఖ్యానించారు.
ఉపాధి హామీ పథకం, విపత్తు, పాఠశాల నిధులు ఇవ్వాలని వందసార్లకు పైగా కోరినా, వాటి గురించి మాట్లాడని నిర్మలా సీతారామన్.. ‘రూ’ వ్యవహారంపై మాట్లాడారని ధ్వజమెత్తారు. ఏదేమైనా జాతీయ స్థాయిలో తమిళం హిట్, బడ్జెట్ హిట్ అని ఆయన పేర్కొన్నారు. తమిళనాడు ప్రభుత్వం ‘₹’ లోగోను తొలగించడంపై నిర్మలమ్మ తీవ్రంగా మండిపడిన విషయం తెలిసిందే. ఎన్నికైన ప్రజాప్రతినిధులు జాతీయ ఐక్యత, సార్వభౌమత్వాన్ని కాపాడుతామని రాజ్యాంగంపై ప్రమాణం చేస్తారని, కానీ, రూపాయి సింబల్ తొలగింపు ఆ ప్రమాణానికి విరుద్దమని విమర్శించారు. .డీఎంకే చర్యలు.. దేశ ఐక్యతను దెబ్బతీసేలా ఉన్నాయని, ప్రాంతీయ అస్థిత్వం పేరుతో వేర్పాటువాద భావాలను ప్రోత్సహించే ప్రమాదకరమైన మనస్తత్వాన్ని సూచిస్తున్నాయని నిర్మలా సీతారామన్ దుయ్యబట్టారు.
కాగా, హిందీని తమపై బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తున్నారని, ఎట్టి పరిస్థితుల్లోనూ జాతీయ విద్యా విధానాన్ని తమిళనాడులో అమలు చేయబోమని స్టాలిన్ సర్కారు అంటోంది. అయితే, కేంద్రం మాత్రం ఇవి కేవలం ఆరోపణలు మాత్రమేనని చెబుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం- తమిళనాడు సర్కారు మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తమిళనాడు బడ్జెట్లోనూ ‘రూ’ అక్షరాన్ని చేర్చడంతో వివాదం మరింత ముదిరినట్టయ్యింది. సీఎం నిర్ణయాన్ని తమిళ సంఘాలు స్వాగతించాయి. మాతృభాషను కాపాడుకోవడానికి తీసుకొన్న చర్యగా అభివర్ణించాయి. మరికొందరు మాత్రం జాతీయ చిహ్నాన్ని తక్కువ చేసి చూపించారని విమర్శిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa