రాష్ట్రంలో మరో ప్రఖ్యాత ఆటోమొబైల్ కంపెనీ ప్రారంభం కాబోతోంది. దేశంలోనే రెండో అతిపెద్ద వాహన తయారీ సంస్థ హిందూజా గ్రూప్ అనుబంధ సంస్థ అయిన అశోక్ లేల్యాండ్ ఎలక్ర్టికల్, డీజిల్ బస్సులకు అత్యాధునిక బాడీ బిల్డింగ్ యూనిట్ను ఏపీలో ప్రారంభిస్తోంది. భారీ పరిశ్రమల కేటగిరీలో విజయవాడ మల్లవల్లి మోడల్ ఇండస్ర్టియల్ పార్క్లో ఏర్పాటు చేసిన ఆ ప్లాంట్ను మంత్రి లోకేశ్ బుధవారం సాయంత్రం 5 గంటలకు లాంఛనంగా ప్రారంభించనున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో రూపుదిద్దుకున్న మల్లవల్లి మోడల్ ఇండస్ర్టియల్ కారిడార్లో అశోక్ లేల్యాండ్కు రాష్ట్ర ప్రభుత్వం భూములు కేటాయించింది. ఇందులో ఆ సంస్థ ఎలక్ర్టికల్ బస్ బాడీ బిల్టింగ్ ప్లాంట్ నెలకొల్పింది. దీనిని అంగరంగ వైభవంగా ప్రారంభోత్సవం చేసేలోపు అధికారంలోకి వైసీపీ వచ్చింది. అప్పటి నుంచి గత ప్రభుత్వం అశోక్ లేల్యాండ్కు తగిన సహకారం ఇవ్వలేదు. కొవిడ్ అనంతర పరిస్థితులు కూడా ప్లాంట్ కార్యకలాపాలకు ఆటంకంగా మారాయి. కూటమి ప్రభు త్వం వచ్చాక అశోక్ లేల్యాండ్ సంస్థ ప్లాంట్ ప్రారంభానికి చర్యలు చేపట్టింది. ఎలక్ర్టికల్ బస్సులే కాకుండా అన్ని రకాల బస్సులకు బాడీ బిల్డింగ్ చేసే దిశగా ప్లాంట్ను అందుబాటులోకి తీసుకువచ్చారు. అమరావతి రాజధాని ప్రాంత పరిధిలో ప్రారంభం కాబోతున్న మొట్టమొదటి ఆటోమొబైల్ ప్లాంటు ఇది. మల్లవల్లి అశోక్ లేల్యాండ్లో ఫేజ్ -1లో 600 మందికి, ఫేజ్ -2 లో 1200 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 75 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్లాంటులో అత్యాధునిక సాంకేతిక ప్రమాణాలతో బస్సులకు బాడీ బిల్డింగ్ చేస్తారు. ఈ ప్లాంట్లో 7 మీటర్ల నుంచి 13.5 మీటర్ల వరకు బీఎస్- 6 మోడళ్ల బస్సులను ఉత్పత్తి చేస్తారు. ఈ ప్లాంటు ఫేజ్-1, 2లలో సంవత్సరానికి 2,400 బస్సుల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తుంది. అశోక్ లేల్యాండ్ ప్రపంచంలో బస్సుల ఉత్పత్తిలో 4వ స్థానంలోనూ, ట్రక్కుల ఉత్పత్తిలో 13వ స్థానంలోనూ ఉంది. ఇటీవల భారతదేశంలో 34వ ఉత్తమ బ్రాండ్గా ర్యాంక్ను పొందింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa