తూర్పుగోదావరి జిల్లా బలభద్రపురం గ్రామంలో క్యాన్సర్ కేసులు.. జాతీయ, రాష్ట్ర స్థాయితో పోల్చితే సాధారణ స్థాయిలోనే ఉన్నాయని, ఈ విషయంలో ఆందోళన అక్కర్లేదని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్యాదవ్ అన్నారు. అక్కడ పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని స్పష్టం చేశారు. సోమవారం అమరావతి సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లో అనపర్తి శాసనసభ్యులు బలభద్రపురంలో క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవడంతోపాటు మరణాలు కూడా సంభవిస్తున్నాయని సభ దృష్టికి తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో గ్రామంలో సమగ్ర క్యాన్సర్ సర్వేను ప్రారంభించామని తెలిపారు. సేకరించిన వివరాల ప్రకారం ఈ గ్రామంలో పూర్వం ఉన్న కేసులు, ప్రస్తుత అనుమానిత కేసులు మొత్తం కలిపి 38 దాటకపోవచ్చని తెలిపారు. సర్వేలో అనుమానిత కేసులుగా 38 మందిని గుర్తించగా.. వాటిలో 10-15 శాతమే పాజిటివ్గా తేలే అవకాశం ఉందన్నారు. గ్రామంలో 31 వైద్య బృందాలతో సార్వత్రిక క్యాన్సర్ స్ర్కీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కాగా, డీలిమిటేషన్ ప్రక్రియకు ఓ ప్రత్యేక విధానం ఉంటుందని మంత్రి సత్యకుమార్ అన్నారు. జనాభా ప్రాతిపదికన మాత్రమే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని ఎవరూ నిర్ధారించలేదన్నారు. తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లోని కుటుంబ పార్టీలే ఈ తరహా వాదన తెస్తున్నాయన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa