ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెస్టారెంట్లలో కస్టమర్లు సర్వీస్ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.. హైకోర్టు ఆదేశాలు

national |  Suryaa Desk  | Published : Fri, Mar 28, 2025, 07:38 PM

సాధారణంగా మనం ఏదైనా హోటల్, రెస్టారెంట్‌కు వెళ్లి భోజనం చేసిన తర్వాత తిన్న ఐటెమ్స్‌కు బిల్ వేసి ఇస్తారు. అందులో ట్యాక్సులు అన్నీ కలిపి జీఎస్టీ వేస్తారు. అయితే కొన్ని కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ఫుడ్ బిల్లుతోపాటు అందులోనే సర్వీస్ ఛార్జీలను కలిపి వసూలు చేస్తారు. కానీ సర్వీస్ ఛార్జీని కస్టమర్లు కచ్చితంగా చెల్లించాల్సిన అవసరం లేదు. వారికి ఇష్టం ఉంటే ఇవ్వొచ్చు లేదు అనుకుంటే కేవలం తిన్న ఫుడ్‌కు మాత్రమే బిల్లు చెల్లించవచ్చు. కానీ కొన్ని రెస్టారెంట్లు, హోటళ్లు మాత్రం బిల్‌తోపాటు సర్వీస్ ఛార్జీని కలిపి కస్టమర్ల వద్ద బలవంతంగా వసూలు చేస్తూ ఉంటాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా.. ధర్మాసనం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


భోజనం బిల్లుతోపాటు సర్వీస్ ఛార్జీ కలిపి వసూలు చేయడం సరైంది కాదని ఢిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. వినియోగదారులు సర్వీస్ ఛార్జీ కచ్చితంగా చెల్లించాలనే రూల్ లేదని వెల్లడించింది. ఇలా బిల్లులో సర్వీస్ ఛార్జీని కలిపి ఇవ్వడం వారి హక్కులను కాలరాయడమే అవుతుందని స్పష్టం చేసింది. అదే సమయంలో వివిధ పేర్లతో ఛార్జీలు వసూలు చేయడం అన్యాయమని పేర్కొంది. సర్వీస్‌ ఛార్జీలు చెల్లించాలా.. వద్దా.. అనే విషయాన్ని కస్టమర్లకే వదిలేయాలని సూచించింది.


అదే సమయంలో బిల్లుతోపాటు సర్వీస్ ఛార్జీలు విధిస్తూ.. కస్టమర్ల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేస్తున్న రెస్టారెంట్లను గుర్తించి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ-సీసీపీఐకు సూచించింది. ఈ సందర్భంగా బిల్లుతోపాటు సర్వీస్‌ ఛార్జీలు వసూలు చేయడాన్ని నిషేధిస్తూ సీసీపీఏ గతంలో చేసిన మార్గదర్శకాలను సవాల్ చేస్తూ పలు రెస్టారెంట్లు, హోటల్‌లు దాఖలు చేసిన పిటిషన్లను ఈ సందర్భంగా ఢిల్లీ హైకోర్టు కొట్టివేసింది.


హోటళ్లు, రెస్టారెంట్లలో వసూలు చేస్తున్న సర్వీస్‌ ఛార్జీలు.. ట్యాక్సుల కిందికి రావని 2017లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇలాంటి ఛార్జీలను సేవా పన్నుగా భావించడం పొరపాటేనని వెల్లడించింది. ఈ సర్వీస్ ఛార్జీల చెల్లింపులను కస్టమర్ల ఇష్టానికే వదిలేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలోనే అన్ని హోటళ్లు, రెస్టారెంట్లలో ప్రత్యేకంగా బోర్డులు పెట్టాలని ఆదేశించింది. సీసీపీఏ ఇచ్చిన ఆదేశాల ప్రకారం బిల్లులో సర్వీస్ ఛార్జీని ఖాళీగా వదిలేయాల్సి ఉన్నా.. కొన్ని హోటళ్లు, రెస్టారెంట్లు మాత్రం కస్టమర్ల నుంచి బలవంతంగా వసూలు చేస్తున్నాయి. దీనిపై ఢిల్లీ హైకోర్టు ఫైర్ అయింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com