అధికార టిడిపిలో ఎమ్యెల్యే టికెట్లను ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. అలాంటి పరిస్తుతుల్లో కూడా కొందరికి అనూహ్యంగా టికెట్లు దక్కుతున్నాయి. ఇప్పటికే మెజారిటీ స్థానాల్లో అభ్యర్థుల విషయంలో ఒక అంచనాకు వచ్చిన చంద్రబాబు మిగిలిన సీట్ల విషయంలో కూడా తుది నిర్ణయం తీసుకుంటున్నారు. తాజాగా రాజమహేంద్రవరం సిటీ టీడీపీ టికెట్టు ఆదిరెడ్డి భవానికి ఖరారైనట్లు తెలిసింది. మొదటినుంచి ఈ పేరు వినిపిస్తున్నప్పటికీ ఈ మధ్య రకరకాల ప్రచారాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు ఆయన కుమారుడు వాసు, కోడలు భవాని కలిసి అమరావతి వెళ్లి సోమవారం రాత్రి ముఖ్యమంత్రిని కలిశారు. పది గంటల సమయంలో వీరు సీఎంను కలిసి వచ్చారు. భవాని పేరును ఖరారు చేస్తున్నట్ల సీఎం తెలిపారని ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు తెలిపారు. ఇక అధికారికంగా ప్రకటించడమే తరువాయి. ఈ పేరు అధికారికంగా ప్రకటిస్తే రాజమహేంద్రవరం లోక్సభ పరిధిలో తూర్పుగోదావరి జిల్లాకు చెందిన సిటీ, రూరల్, రాజానగరం, అనపర్తి స్థానాలు నాలుగు ఖరారైనట్లే.
ఇక ఎంపీ అభ్యర్థి ఖరారు కావాల్సి ఉంది. ఇంతవరకు పెద్దాపురం ఎమ్మెల్యే సీటును కోరిన బొడ్డు భాస్కరరామారావు తాను ఎంపీకి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు సోమవారం స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. కానీ దీనిపై అధిష్ఠానందే తుది నిర్ణయం. సిట్టింగ్ ఎంపీ మురళీమోహన్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి పిలుపువచ్చింది. ఆయన కూడా సోమవారం రాత్రి అక్కడే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఎవరికి టికెట్టు ఖరారవుతుందన్నది ఒకటి, రెండు రోజుల్లో తెలియవచ్చు. ఇప్పటివరకు టికెట్టు రేసులో ఉన్న గుడా చైర్మన్ గన్నికృష్ణ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో అసంతృప్తిగా ఉన్నట్టు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో టీడీపీ నాయకులు బొడ్డు భాస్కర రామారావు రాజమహేంద్రవరం పార్లమెంట్ నియోజకవర్గం నుంచి టీడీపీ తరుపున పోటీ చేయించేందుకు పార్టీ అధిష్ఠానం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది.పెద్దాపురం నియోజకవర్గంనుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొంది మళ్లీ ఇక్కడి నుంచే పోటీ చేస్తానని, అందుకు పార్టీ తరపున సీటు ఇవ్వాలని అధిష్ఠానం ముందు వారంరోజులుగా డిమాండ్ చేస్తున్న భాస్కరరామారావుకు రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గంనుంచి పోటీ చేయాల్సిందిగా అధిష్ఠానం సూచించినట్లు తెలిసింది. ఇప్పటికే ఇక్కడినుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఉపముఖ్యమంత్రి చినరాజప్పను కాకుండా భాస్కరరామారావుకు సీటు ఇచ్చేందుకు పార్టీ అధిష్ఠానం సమ్మతించలేదు. రాజమహేంద్రవరంనుంచి ఎంపీ బరిలో ఉండేందుకు భాస్కరరామారావు అంగీకరించకుండా స్వగ్రామం వచ్చేశారు. నాలుగు రోజులుగా పార్టీలోని ఆయన అనుచరులు, కొందరు సన్నిహితుల సూచనల మేరకు పార్టీని వీడి వేరే పార్టీనుంచి పోటీ చేసేందుకు సమాలోచనలు చేశారు. ఒకదశలో వేరే పార్టీనుంచి తమకు సీటు ఖరారయ్యిందని ప్రచారం, ఆలయాల్లో పూజలు, బాణసంచా కాల్పులు వంటివి నిర్వహించారు. కానీ సోమవారం తెల్లవారుజామునుంచి సీన్ మారింది. టీడీపీలోనే ఉండి రాజమహేంద్రవరం ఎంపీ బరిలో నిల్చునేందుకు నిర్ణయించి ఆ దిశలో సమాలోచనలు తిరిగి ప్రారంభించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa