ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విశాఖ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 02, 2025, 08:02 PM

విశాఖపట్నంలో జరిగిన ఒక హృదయ విదారక ఘటనలో.. ప్రేమోన్మాది దాడిలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం.. మరొక యువతి ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందడం చోటుచేసుకుంది. ఈ ఘటనపై ఆందోళనకు గురైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా స్పందించారు. తమ జీవితాలను ప్రేమ పేరుతో వాడుకున్న వ్యక్తి ఇలా భయంకరంగా దాడి చేయడంపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం ఆవేదన వ్యక్తం చేస్తూ.. చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితిపై వివరాలను తెలుసుకున్నారు. బాధిత యువతికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు సూచించారు. ఇంతటి దారుణానికి పాల్పడిన ఆ నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఈ దారుణమైన ఘటన విశాఖపట్నం మధురవాడ స్వయం కృషి నగర్‌లో చోటుచేసుకుంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


విశాఖలో ఓ యువకుడు ప్రేమ పేరుతో యువతిని బెదిరించి.. ఆమె ఇంటికి వెళ్లి కత్తితో దాడి చేశాడు. ఆమె తల్లి తన కుమార్తెను రక్షించేందుకు ప్రయత్నించింది. ఈ క్రమంలో ఆ ప్రేమోన్మాది కత్తితో ఆమెపై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన యువతి తల్లి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ దాడిలో ఆ యువతి తీవ్రంగా గాయపడగా.. ఆమెను స్థానికులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె పరిస్థితి కూడా ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటన అనంతరం నిందితుడు అటుగా పారిపోయాడు. స్థానికులు ఇచ్చిన ఫిర్యాదుతో పీఎం పాలెం పోలీసులు వెంటనే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


ప్రేమోన్మాది ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. ఈ వ్యవహారానికి ముఖ్య కారకుడు అయిన నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యువతిపై ప్రేమోన్మాది దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోవడం.. మరొకరు ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో ఉండటంపై ఆమె దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె సీపీ శంఖబ్రత బాగ్చీతో మాట్లాడారు. ఫోన్ ద్వారా బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఆ యువతికి మెరుగైన వైద్యం అందించాలని ఆమె సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa