పరిటాల సునీత ఇవాళ మీడియా సమావేశం ఏర్పాటు చేసి సంచలన ఆరోపణలు చేశారు. తన భర్త పరిటాల రవి హత్యలో జగన్ పాత్ర కూడా ఉందని అన్నారు. పరిటాల రవి హత్య కేసులో సీబీఐ జగన్ ను కూడా విచారించిందని గుర్తు చేశారు. ఇవాళ టీవీ బాంబు గురించి మాట్లాడుతున్న వారు కారు బాంబు గురించి కూడా మాట్లాడాలని వ్యాఖ్యానించారు. రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో 45 మందిని హత్యకు గురయ్యారని ఆరోపించారు. రాప్తాడులో తోపుదుర్తి సోదరులు ముఠా కక్షలను రెచ్చగొడుతున్నారని సునీత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓబుల్ రెడ్డి, మద్దెలచెరువు సూరి కుటుంబాలను ఫ్యాక్షనిజంలోకి లాగుతున్నారని విమర్శించారు. "తోపుదుర్తి సోదరుల మాటలు నమ్మి ఈ కుట్రలో భాగస్వామ్యం కావొద్దని కనుముక్కల ఉమ, గంగుల భానుమతికి విజ్ఞప్తి చేస్తున్నా... ఇప్పటికే మన మూడు కుటుంబాలు ఫ్యాక్షన్ కారణంగా చాలా నష్టపోయాయి. మనం కోలుకోవడానికి చాలా సమయం పట్టింది... ఇప్పుడు మళ్లీ తోపుదుర్తి సోదరులు ఫ్యాక్షన్ ఉచ్చులోకి లాగడానికి ప్రయత్నిస్తున్నారు. తోపుదుర్తి సోదరులు ఏం చెప్పినా జగన్ నమ్మేస్తున్నారు... ఐదేళ్లు సీఎంగా పనిచేసిన మీరు నిజానిజాలు తెలుసుకోరా? జగన్ శుక్రవారం నాడు పాపిరెడ్డిపల్లి గ్రామానికి వస్తానంటున్నారు... ఆయనకు శుక్రవారం కలిసొచ్చిందేమో! వచ్చేటప్పుడు జగన్ తన సూట్ కేసులో కాస్త దుస్తులు ఎక్కువగా తెచ్చుకుంటే బాగుంటుంది... లింగమయ్య కుటుంబాన్నే కాదు, మీ పార్టీ వల్ల నష్టపోయిన వారి కుటుంబాలను కూడా పరామర్శించాలి కదా! ప్రశాంతంగా ఉన్న గ్రామాల్లో ఫ్యాక్షన్ చిచ్చు పెట్టవద్దని జగన్ కు స్పష్టం చేస్తున్నా" అంటూ పరిటాల సునీత పేర్కొన్నారు.
![]() |
![]() |