ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బీజేపీకి అధ్యక్ష పదవికి అన్నామలై రాజీనామా,,,తాను చీఫ్ రేసులో లేనని ప్రకటన

national |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 07:21 PM

తమిళనాడు బీజేపీకి పెద్ద కష్టం వచ్చి పడింది. ఇప్పటివరకు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న అన్నామలై బీజేపీ అధ్యక్షుడి పదవికి రాజీనామా చేశారు. తాను చీఫ్ రేసులో లేనని ప్రకటించారు. ఇదిలావుంటే వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అధికారంలో ఉన్న డీఎంకే మరోసారి గెలుపొందాలని చూస్తుండగా.. ఎలాగైనా ఈసారి తమిళనాడులో అడుగుపెట్టాలని బీజేపీ పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధం అయింది. గత నెలలో అన్నాడీఎంకే అధ్యక్షుడు పళనిస్వామి.. ఢిల్లీకి వెళ్లి బీజేపీ అగ్రనేత, కేంద్రమంత్రి అమిత్ షాతో సమావేశం అయ్యారు. అయితే బీజేపీ-అన్నాడీఎంకే పొత్తు కోసమే ఈ భేటీ జరిగిందని.. కానీ అందులో సయోధ్య కుదరలేదని సంబంధిత వర్గాల్లో చర్చ జరిగింది. ఈ క్రమంలోనే ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అధ్యక్షుల నియామకం చేస్తున్న బీజేపీ.. తమిళనాడులో కూడా అదే పనిచేయనుంది. అయితే ప్రస్తుత అధ్యక్షుడు అన్నామలై.. తన పదవికి రాజీనామా చేయడం గమనార్హం. తాను తదుపరి అధ్యక్షుడి రేసులో లేనని ప్రకటించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.


అయితే తమిళనాడులో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు అన్నాడీఎంకే బలమైన డిమాండ్‌ను అమిత్ షా ముందు ఉంచినట్లు తమిళనాడు రాజకీయాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. తమిళనాడు బీజేపీ అధ్యక్ష పదవి నుంచి అన్నామలైని తప్పిస్తేనే తాము బీజేపీతో దోస్తీ చేస్తామని పళనిస్వామి కుండబద్ధలు కొట్టి చెప్పినట్లు సమాచారం. అందులో భాగంగానే తమిళనాడు బీజేపీ చీఫ్ పదవి నుంచి అన్నామలైని దూరంగా ఉండాలని హైకమాండ్ బుజ్జగించినట్లు కాషాయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.


ఒకవేళ అన్నామలైని బీజేపీ చీఫ్ పదవి నుంచి తప్పించినా.. ఆయనకు సరైన గౌరవం ఇస్తుందని కమలం నేతలు చర్చించుకుంటున్నారు. 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీలోగానీ ప్రభుత్వంలో గానీ అన్నామలైకి మంచి స్థానం కల్పిస్తారని తెలుస్తోంది. ఇక అన్నామలై బీజేపీ చీఫ్ పదవి కాలం పూర్తయిన తర్వాత కేంద్రమంత్రి పదవి ఇస్తారని బీజేపీ నేత ఒకరు చెప్పడం గమనార్హం. ఐపీఎస్ అధికారిగా పనిచేసిన అన్నామలై.. తన పదవికి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి.. బీజేపీలో చేరారు. అనతి కాలంలోనే బీజేపీలో మంచి పేరు సంపాదించుకున్న అన్నామలై.. 2021లో బీజేపీ తమిళనాడు అధ్యక్షుడిగా నియామకం అయ్యారు. అప్పటి నుంచి చాలా యాక్టివ్‌గా ఉంటున్న అన్నామలై.. ద్రవిడ పార్టీలను ఢీకొంటూ బీజేపీ ప్రచారం చేస్తున్నారు.


తాజాగా మాట్లాడిన అన్నామలై.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో తాను లేనని స్పష్టం చేశారు. బీజేపీలో నాయకత్వం కోసం నేతలు పోటీ పడరని.. అంతా కలిసి ఏకగ్రీవంగా చీఫ్‌ను ఎన్నుకుంటామని చెప్పారు. బీజేపీకి ఉజ్వల భవిష్యత్తు ఉండాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పిన అన్నామలై.. పార్టీ ఎప్పటికీ బాగుండాలని పరితపించే వ్యక్తినని స్పష్టం చేశారు. ప్రస్తుతం వస్తున్న రాజకీయ ఊహాగానాలపై స్పందించనని చెప్పిన అన్నామలై.. తాను ఏ రేసులోనూ లేనని తెలిపారు. వేరే పార్టీల లాగా బీజేపీలో అధ్యక్ష పదవి కోసం 50 మంది నేతలు నామినేషన్లు దాఖలు చేయరని తేల్చి చెప్పారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com