ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైలులో ఫోన్‌ పోయిందా.. వాటి రికవరీకిి ఆర్పీఎఫ్ ముందడుగు

national |  Suryaa Desk  | Published : Fri, Apr 04, 2025, 07:23 PM

రైలులో మీ ఫోన్ పోయిందా లేక ఎవరైనా దొంగిలించారా. ఫోన్ పోగొట్టుకున్నామని బాధపడుతున్నారా. ఇవన్నీ ఇప్పటివరకు. కానీ ఇప్పటినుంచి పరిస్థితి మారిపోతుంది. మీరు రైలులో ఫోన్ పోగొట్టుకున్నా లేదా ఎవరైనా చోరీ చేసినా.. వారిని పట్టుకుని వారి నుంచి మన ఫోన్ తీసుకునేందుకు ఆర్పీఎఫ్ ముందడుగు వేసింది. మనలో చాలా మంది తరచూ రైలు ప్రయాణాలు చేస్తూ ఉంటారు. అయితే ప్రయాణంలో ఉండే హడావుడి కారణంగా ఏదో ఒక వస్తువును అందులోనే మర్చిపోతూ ఉంటాం. కొన్నిసార్లు రైళ్లలో ఉండే దొంగలు మన వస్తువులు దొంగిలిస్తూ ఉంటారు. వాటి గురించి రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేస్తూ ఉంటాం. ఇందులో మరీ ముఖ్యంగా సెల్‌ఫోన్ మర్చిపోయినా, ఎవరైనా దొంగిలించినా.. మనం ఎటూ కాని పరిస్థితిలో పడిపోతూ ఉంటాం. అయితే ఇలాంటి వాటికి చెక్ పెట్టేలా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్-ఆర్పీఎఫ్ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో ఫోన్లు పోయినా.. ఎవరైనా దొంగిలించినా కనిపెట్టేందుకు చర్యలు చేపట్టింది. ఇందుకోసం కేంద్ర టెలికాం శాఖకు చెందిన సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్-సీఈఐఆర్‌తో కలిసి పనిచేయనుంది.


రైలులో పోయిన మొబైల్ ఫోన్లను కనిపెట్టడానికి సీఈఐఆర్‌తో ఆర్పీఎఫ్ కలిసి పనిచేస్తోంది. నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో ఆర్పీఎఫ్‌ నిర్వహించిన పైలట్ ప్రోగ్రాం సక్సెస్ కావడంతో దాన్ని క్రమంగా విస్తరించనున్నారు. పోయిన, దొంగలించిన మొబైల్ ఫోన్లను సీఈఐఆర్ ద్వారా బ్లాక్ చేసి.. వాటిని ట్రాక్ చేయవచ్చని ఆర్పీఎఫ్ అధికారులు వెల్లడించారు. రైల్వే ప్రయాణికులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. సీఈఐఆర్‌ పోర్టల్‌ ద్వారా దొంగలించిన లేదా కనిపించని మొబైల్‌ ఫోన్లను ట్రాక్‌ చేయడం, వాటి ఐఎంఈఐ నంబర్లను బ్లాక్‌ చేయడం ద్వారా వాటిని తిరిగి పనిచేయకుండా చేయవచ్చు.


అంతేకాకుండా మొబైల్‌ ఫోన్లు అక్రమంగా విక్రయించబడటాన్ని లేదా దొంగిలించబడటాన్ని నిరోధించవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. ఈ పోర్టల్‌ ద్వారా కోల్పోయిన ఫోన్లను త్వరగా పట్టుకోవడం సాధ్యం అవుతుందని పేర్కొన్నారు. నార్త్ ఈస్ట్ ఫ్రంటీయర్ రైల్వేలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు దేశవ్యాప్తంగా అమలు చేస్తుండటంతో లక్షలాది రైల్వే ప్రయాణికులకు ఉపయోగపడనుంది. ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవా డిజిటల్‌ టెక్నాలజీ ద్వారా ప్రయాణికుల భద్రతను మెరుగుపరచడమే లక్ష్యమని తెలిపారు. ఇది పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. రైలు ప్రయాణికులు పోగొట్టుకున్న ఫోన్లు.. తిరిగి వారి వద్దకు చేరనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com