ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పించే దిశగా ప్రభుత్వం అడుగులు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 08:45 PM

ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ విధానం ఎక్కువగా పెద్ద కార్పొరేట్ సంస్థల్లో కొనసాగుతోంది. కోవిడ్-19 మహమ్మారి తర్వాత అనేక కంపెనీలు ఈ విధానాన్ని కొనసాగిస్తున్నాయి. ఈ విధానం కంపెనీలకు నిర్వహణాపరంగా సులభంగా ఉండటమే కాకుండా.. ఆర్థికంగా కూడా లాభదాయకంగా ఉండటంతో మరిన్ని సంస్థలు తమ కార్యకలాపాలను ఇంటి నుండి నిర్వహించడానికి ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాయి. దీని ద్వారా ఎక్కువ మంది యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి.. వర్క్ ఫ్రమ్ హోమ్‌కు అనువైన మౌలిక సదుపాయాలు కలిగిన కేంద్రాలను గుర్తించే ప్రక్రియ ప్రస్తుతం చురుగ్గా సాగుతోంది.


హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లో ఎన్నో ఉద్యోగావకాశాలు ఉన్నప్పటికీ.. కొంతమంది యువతీ యువకులు వివిధ కారణాల వల్ల అక్కడికి వెళ్లడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. పట్టణాల్లో పనిచేసినా వచ్చే జీతంలో అధిక భాగం రూం రెంట్, హాస్టల్, వినోదాత్మక కార్యక్రమాలకే ఎక్కువగా ఖర్చు అవుతుంది.


అలాగే తమ తల్లిదండ్రులు, కుటుంబాలకు దూరంగా ఉండాల్సి రావడంతో చాలా మంది సొంతూళ్లలోనే ఏదో ఒక చిన్న వ్యాపారం లేదా వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ఇటువంటి వారిని గుర్తించి.. ఇంటి వద్దే ఉంటూనే ఐటీ , ఇతర రంగాల్లోని కంపెనీలకు పనిచేయడానికి ఆసక్తి కలిగిన యువతను గుర్తించే పనులు ప్రారంభమయ్యాయి. ఇందుకోసం గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా గ్రామాల్లో , పట్టణాల్లో అందుబాటులో ఉన్న యువతీ యువకులు, వారి విద్యార్హతలు, పనిచేయడానికి ఉన్న ఆసక్తిని ఒక సమగ్రమైన సర్వే ద్వారా సేకరిస్తున్నారు.


ఉదాహరణకు.. అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 4 లక్షల ఇళ్లలో 8 లక్షల 85 వేల మందికి పైగా జనాభా ఉన్నారు. సచివాలయ ఉద్యోగులు ప్రతి ఇంటికి వెళ్లి ఇప్పటివరకు 5 లక్షల 37 వేల మందికి పైగా అభిప్రాయాలను సేకరించగా.. ఇంకా 3 లక్షల 47 వేల మంది అభిప్రాయాలను తీసుకోవాల్సి ఉంది. ఈ సర్వే ద్వారా లభించిన సమాచారం ఆధారంగా.. వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోనుంది.


వర్క్ ఫ్రమ్ హోమ్ ద్వారా పనిచేయడానికి ముందుకు వచ్చే నిరుద్యోగ యువతకు అవసరమైన ప్రాథమిక సౌకర్యాలను కల్పించడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. నిరంతరాయమైన ఇంటర్నెట్ సదుపాయం, సౌకర్యవంతమైన వాతావరణం కోసం ఎయిర్ కండిషనింగ్ వంటి వసతులు కలిగిన భవనాలను గుర్తించే పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే అచ్యుతాపురం మండలంలో ఏపీఐఐసీ వన్-స్టాప్ కార్యాలయాన్ని గుర్తించారు. ప్రభుత్వ భవనాలు అందుబాటులో లేని ప్రాంతాల్లో, అవసరమైతే ప్రైవేటు భవనాలను కూడా ఎంపిక చేయనున్నారు. ఈ చర్యల ద్వారా.. రాష్ట్రంలోని యువతకు వారి స్వస్థలాల్లోనే ఉపాధి అవకాశాలు లభించనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com