ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సచివాలయాల్లో ఖాళీల భర్తీకి త్వరలోనే నోటిఫికేషన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Apr 06, 2025, 08:50 PM

ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం త్వరలోనే మరో రెండు మూడు రోజుల్లో డీఎస్పీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. దీని ద్వాారా 16 వేల టీచర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. దీంతో పాటు మరికొన్ని శాఖల్లోని ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ క్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఖాళీగా ఉన్న ఉద్యోగాలను కూడా భర్తీ చేయనున్నట్టు ఏపీ మంత్రి సంధ్యారాణి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీపై ఏపీ మహిళా శిశు సంక్షేమ, గిరిజన శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖాళీల భర్తీ, ఉన్నత విద్యావంతులైన ఉద్యోగులకు పదోన్నతులపై త్వరలో ప్రభుత్వం ప్రకటన విడుదల చేయనున్నట్లు మంత్రి సంధ్యారాణి తెలిపారు. ఈ మేరకు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మున్సిపల్ ఆఫీసులో శనివారం ఉద్యోగులతో జరిగిన సమావేశంలో మంత్రి వెల్లడించారు. ఖాళీలు ఎక్కువగా ఉండటంతో మిగతావారిపై పనిభారం అధికంగా పడుతోందని, దీన్ని తగ్గిస్తామని ఆమె చెప్పారు. ఉద్యోగులు ప్రశాంతంగా విధులు నిర్వహించడమే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆలోచన అని అన్నారు. అలాగే, ప్రస్తుతం అద్దె భవనాల్లో కొనసాగుతోన్న ప్రభుత్వ ఆఫీసుల కోసం నూతన భవనాలు నిర్మిస్తామని మంత్రి పేర్కొన్నారు.


 కాగా, గ్రూప్-2 ఉద్యోగాలకు సంబంధించి రాత పరీక్షను నిర్వహించిన ఏపీపీఎస్సీ.. శనివారం నాడు ఫలితాలను విడుదల చేసింది. రికార్డుస్థాయిలో 40 రోజుల్లోపే ఈ ఫలితాలు విడుదల కావడం విశేషం. ఇక, త్వరలోనే మెగా డీఎస్సీకి కూడా రంగం సిద్ధమవుతోంది. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఏప్రిల్ మొదటి వారంలోనే విడుదలవుతుందని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మరో రెండు మూడు రోజుల్లో ఇది విడుదల కానున్నట్టు తెలుస్తోందది.


అలాగే, జిల్లాలో ఏనుగుల సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు. శాశ్వత పరిష్కారం చూపాలని అధికారులకు చంద్రబాబు సూచించారని, ఏనుగుల తరలింపు, అనుసరించాల్సిన విధానాలు, సాంకేతిక అంశాలను పరిశీలిస్తున్నామని వివరించారు. పార్వతీపురం మన్యం జిల్లా ఏర్పడి మూడేళ్ల పూర్తయిందని, ప్రగతి పథంలో నడిపించే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుందని తెలిపారు. పూర్ణపాడు-లాబేసు వంతెనకు నిధులను కేటాయించేందుకు సీఎం సానుకూలత వ్యక్తం చేశారని, మరో రూ.15 కోట్లు అవసరమవుతాయని తెలిపారు.


అలాగే, గిరిజన ఉత్పత్తుల అమ్మకానికి హట్‌బజార్లు ఏర్పాటును వేగవంతం చేస్తున్నట్టు మంత్రి వివరించారు. వన్‌ధన్ వికాస కేంద్రాల ద్వారా మరింత సౌకర్యవంతమైన మార్కెటింగ్ వ్యవస్థ‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు. ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్‌లో భాగంగా సీతంపేట మండలంలో పార్కు ఏర్పాటుకు ప్రభుత్వం 27 ఎకరాల స్థలం కేటాయించిందని, త్వరలో అన్ని నియోజకవర్గాల్లో ఏర్పాటు చేయనున్నామని చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com