అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమయ్యేలా ఉంది. అమెరికా అధ్యక్షుడు ప్రతీకార సుంకాలు విధించడంతో చైనా కూడా ప్రతిగా సుంకాలు పెంచింది. అమెరికా నుంచి వచ్చే దిగుమతులపై చైనా 34% అదనపు సుంకం విధించింది. దీనిపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 8లోగా నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేకుంటే ఏప్రిల్ 9 నుంచి 50% సుంకాలు విధిస్తామని హెచ్చరించారు. అంతేకాదు, చర్చలు కూడా నిలిపివేస్తామని ఆయన తేల్చి చెప్పారు. చైనా ఇప్పటికే భారీగా టారిఫ్లు విధిస్తోందని, కంపెనీలకు అక్రమ రాయితీలు ఇస్తోందని ట్రంప్ ఆరోపించారు. కరెన్సీ విషయంలోనూ తప్పులు చేస్తోందని మండిపడ్డారు.
‘‘అమెరికాపై చైనా 34 శాతం అదనపు సుంకాలను ప్రకటించింది. ఆ దేశం ఇప్పటికే పెద్దఎత్తున టారిఫ్లు విధిస్తోంది. కంపెనీలకు అక్రమ రాయితీలు, దీర్ఘకాలికంగా కరెన్సీ అవకతవకలకు పాల్పడుతోంది. నేను హెచ్చరించినప్పటికీ.. అదనపు సుంకాల ద్వారా అమెరికాపై ప్రతీకారం తీర్చుకునేందుకు ఏ దేశమైనా ప్రయత్నిస్తే వెంటనే మరిన్ని సుంకాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. తొలుత ప్రకటించిన దానికంటే పెద్దఎత్తున విధిస్తాం. అందువల్ల.. ఏప్రిల్ 8 నాటికి చైనా తన 34 శాతం అదనపు సుంకం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే.. ఏప్రిల్ 9 నుంచే ఆ దేశంపై 50% అదనపు టారిఫ్లు విధిస్తాం. ఆ దేశంతో అన్ని చర్చలూ రద్దు చేస్తాం’ అని ట్రంప్ హెచ్చరించారు. ఈ మేరకు ఆయన తన సొంత సామాజిక మాధ్యమం ట్రూత్ సోషల్లో పోస్ట్ చేశారు.
అమెరికా లిబరేషన్ డే పేరుతో ఏప్రిల్ 2న ట్రంప్ వాణిజ్య భాగస్వామ్య దేశాలపై అదనపు సుంకాలు విధించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో చైనాపై 34% ప్రతీకార సుంకాలు విధించారు. దీనికి చైనా కూడా గట్టిగా బదులిచ్చింది. రెండు విధాలుగా ఉపయోగపడే వస్తువులను 16 అమెరికా సంస్థలకు ఎగుమతి చేయకుండా నిషేధం విధించింది. అమెరికాలోని రక్షణ, కంప్యూటర్, స్మార్ట్ఫోన్ పరిశ్రమలను దెబ్బతీసేలా కొన్ని ఖనిజాల ఎగుమతులపై ఆంక్షలు పెట్టింది. అంతేకాకుండా, ప్రతీకార సుంకాలపై ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీవో)లో సవాలు చేసింది. అయితే, చైనా తీరును తప్పుబట్టిన ట్రంప్.. సుంకాలు మరింత పెంచుతానని అంటున్నారు. అయితే, చైనాసైతం బెదిరింపులు, ఒత్తిళ్లకు తాము భయపడబోమని ఇప్పటికే స్పష్టం చేసింది.
అమెరికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లు ట్రంప్ నిర్ణయంతో కుదేలవుతున్నాయి. కొన్ని లక్షల కోట్ల మదుపర్ల సంపద ఆవిరవుతోంది. చరిత్రలో ఎన్నడూ లేనంతా భారత స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత ముదిరేలా కనిపిస్తోంది. దీని ప్రభావం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై పడే అవకాశం ఉంది. ఇది ఆర్ధిక మాంద్యానికి దారితీస్తుందనే భయాలు వెంటాడుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa