వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పోలీసులపై చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ లోని ఎన్టీఆర్ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తన మాట తీరును మార్చుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఇలాంటి భాష వాడటం చాలా బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీకి ఒక నిబద్ధత, విలువలు ఉన్నాయని, ప్రజల పట్ల తన బాధ్యతను విస్మరించి జగన్ మాట్లాడారని అప్పల నాయుడు విమర్శించారు. పోలీస్లను సైతం వదలకుండా చేస్తున్న వ్యాఖ్యలు బాధాకరమన్నారు. గత ఎన్నికలే ప్రజల్లో వైఎస్సార్సీపీ పట్ల ఉన్న భావానికి ఉదాహరణ అని ఎంపీ కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. మహిళలు, యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి భారీ మెజారిటి ఇచ్చిన విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. కష్టంలో ఉన్న రాష్ట్రానికి కేంద్రం సహకారం అందిస్తూ ముందుకు వెళ్లేందుకు సహరిస్తోందన్నారు. ఒక ఎమ్మెల్యేగా, మాజీ ముఖ్యమంత్రిగా అభివృద్ధి కోసం సలహాలు ఇస్తే స్వీకరిస్తామన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో డీజీపీ స్థాయి వ్యక్తి సైతం మీ కోర్టులో చేతులు కట్టుకుని నిలబడే పరిస్థితికి తెచ్చారని విమర్శించారు. జగన్..మీరు చేస్తున్న శవ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. దేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు సయితం చంద్రబాబు అంటే అభివృద్ధి, నమ్మకానికి బ్రాండ్ అని చెబుతున్నారని, రాష్ట్రంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు. భయం, అసూయతో జగన్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని, నమ్మకం, విశ్వాసం అని జగన్ చెబుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. రాష్ట్రంలో అలజడి సృష్టిస్తున్నారని.. తరువాత బెంగుళూరు వెళ్ళిపోతున్నారని కలిశెట్టి అప్పల నాయుడు అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa