బాపట్ల రైల్వే స్టేషన్ వద్ద మహిళ ఆత్మహత్యాయత్నం తీవ్ర కలకలం రేపింది. ఓ మహిళ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుంది. అంతేకాకుండా విశ్రాంత రైల్వే ఉద్యోగి లక్ష్మినారాయణ వాటేసుకుని మరీ బలవన్మరణానికి పాల్పడింది. తనతో సహ జీవనం చేసి ఇప్పుడు పట్టించుకోవడం లేదని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేసింది. వెంటనే స్పందించిన స్థానికులు ఇరువురి మంటలను ఆర్పివేశారు. అప్పటికే తీవ్రంగా గాయపడిన ఇద్దరిని వెంటనే బాపట్ల ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.బాపట్ల రైల్వే స్టేషన్ సమీపంలో విశ్రాంత రైల్వే ఉద్యోగి లక్ష్మీ నారాయణ రైల్వే రిజర్వేషన్ కౌంటర్ నిర్వహించుకుంటున్నాడు. అతడికి కొంతకాలంగా ఓ మహిళతో వివాహతేర సంబంధం ఉంది. కానీ చాలా రోజులుగా మహిళతో లక్ష్మీ నారాయణ దూరంగా ఉంటూ వస్తున్నాడు. దీంతో ఈరోజు (శుక్రవారం) రిజర్వేషన్ కౌంటర్ వద్దకు వచ్చిన మహిళ అతడిని నిలదీసింది. తన వద్దకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించింది. ఎందుకు దూరంగా పెడుతున్నావంటూ గొడవపెట్టుకుంది. కాసేపు ఇద్దరు వాదులాడుకున్నారు. ఇంతలోనే అనుకోని ఘటన జరిగింది. ఎందుకు దూరంగా ఉంటున్నాడో లక్ష్మీ నారాయణ చెప్పకోవడంతో ఆగ్రహించిన ఆ మహిళ ముందుగానే తనతో తెచ్చుకున్న పెట్రోల్ను ఒంటిపై పోసుకుని నిప్పటించుకుంది. వెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అంతటితో ఆగకుండా నాతో పాటే నువ్వు కూడా అంటూ లక్ష్మీనారాయణను వాటేసుకుంది మహిళ. దీంతో ఇద్దరికి కూడా మంటలు అంటుకున్నాయి. దాదాపు 50 శాతం వరకు ఇద్దరు కాలినట్లు తెలుస్తోంది. మంటలు అంటుకున్న వెంటనే లక్ష్మీ నారాయణ కాపాడాలంటూ బయటకు పరుగులు తీశాడు. ఆ తరువాత అక్కడే మెట్లపై కూర్చుండిపోయాడు. మహిళ కూడా అక్కడే కూర్చుండిపోయింది. వెంటనే స్పందించిన స్థానికులు ఇద్దరి మంటలను ఆర్పి వేసి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి తరలించారు. అయితే అప్పటికే పూర్తి స్థాయిలో మంటలు అంటుకోవడంతో యాభై శాతం వరకు కూడా కాలిపోయిన పరిస్థితి. ప్రస్తుతం వారికి బాపట్ల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నారు. అసలు ఏం జరిగింది.. ఎందుకు మహిళ పెట్రోల్ పోసుకుని నిప్పు పెట్టుకుంది అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. అయితే పగటి పూట ఇలా ఇద్దరు మంటల్లో కాలిపోతున్న ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa