బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకునే వారి కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సార్వభౌమ పసిడి బాండ్లు (ఎస్జీబీ) నిజంగానే కాసుల పంట పండిస్తున్నాయి. 2019 అక్టోబరులో విడుదల చేసిన 2019-20 సిరీస్ V బాండ్లను ముందస్తుగా విక్రయించేందుకు ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి అవకాశం కల్పించడంతో, ఈ పథకంలో పెట్టుబడి పెట్టిన వారు అనూహ్యమైన లాభాలను ఆర్జిస్తున్నారు. కేవలం ఐదున్నర ఏళ్లలో వారి పెట్టుబడిపై ఏకంగా 139 శాతం రాబడి లభించింది. 2019 అక్టోబరులో ఒక గ్రాము బంగారం బాండును రూ. 3,788 ధరకు విక్రయించగా, ప్రస్తుతం ప్రభుత్వం నోటిఫై చేసిన ముందస్తు విక్రయ ధర రూ. 9,069గా ఉంది.
ఈ లెక్కన, ప్రతి గ్రాముపై రూ. 5,281 లాభం వచ్చింది, ఇది 139 శాతానికి సమానం. అంతేకాకుండా, ఈ పెట్టుబడిదారులు ప్రతి సంవత్సరం 2.5 శాతం వార్షిక వడ్డీని కూడా పొందారు.
గోల్డ్ బాండ్ రిటర్న్స్..
ఒక ఉదాహరణ ద్వారా దీన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకుందాం. ఒక వ్యక్తి 2019 అక్టోబరులో రూ. 1 లక్ష పెట్టుబడితో ఈ బాండ్లను కొనుగోలు చేసి ఉంటే, అప్పటి ధర ప్రకారం వారు సుమారుగా 26.40 గ్రాముల బంగారాన్ని కలిగి ఉంటారు. నేటి ధర ప్రకారం ఈ బంగారం విలువ రూ. 2,39,415.60కి చేరుకుంది. అంటే వారి పెట్టుబడిపై మూలధన లాభం రూ. 1,39,415 వచ్చింది. దీనికి అదనంగా ఐదున్నర ఏళ్లకు వారికి రూ. 13,750 వడ్డీ కూడా లభించింది. ఫలితంగా రూ. లక్ష పెట్టుబడిపై అదనంగా రూ. 1.53 లక్షల మేర లాభం వచ్చిందని చెప్పొచ్చు.
గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా బంగారం ధరలు పెరుగుతూ వస్తుండటం ఈ ఎస్జీబీ పెట్టుబడిదారులకు బాగా కలిసి వచ్చింది. ముఖ్యంగా, ఈ బాండ్ల గడువు ముగిసిన తర్వాత వచ్చే లాభాలపై ఎలాంటి దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను ఉండదు. ఇది ఈ పెట్టుబడిని మరింత ఆకర్షణీయంగా మారుస్తుంది. ప్రభుత్వ హామీ ఉండటం వల్ల ఈ పెట్టుబడి దాదాపుగా సురక్షితమైనదిగా పరిగణించబడుతుంది.
ప్రస్తుతం కొత్త ఎస్జీబీలు అందుబాటులో లేనప్పటికీ, పాత బాండ్లలో పెట్టుబడి పెట్టిన వారు మాత్రం లాభాల పంట పండిస్తున్నారు. కొన్నాళ్లుగా ప్రభుత్వం వీటిని విడుదల చేయలేదు. ఇప్పటికే మార్కెట్లో ఉన్న పాత బాండ్ల లావాదేవీలు, వెనక్కి తీసుకోవడం వంటివి జరుగుతున్నాయి.
గోల్డ్ బాండ్ స్కీమ్..
సావరిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ బంగారంలో పెట్టుబడి పెట్టడానికి ఒక ప్రత్యామ్నాయ మార్గం. ఇది భౌతిక బంగారం నిల్వ చేసే ఇబ్బంది లేకుండా, దాని విలువ పెరుగుదలను, స్థిరమైన వార్షిక వడ్డీని (2.5%) అందిస్తుంది. వీటిని స్టాక్ ఎక్స్చేంజీలు, బ్యాంకుల్లో కొనుగోలు చేయొచ్చు. ఆన్లైన్లో కొంటే గ్రాముపై రూ. 50 డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కనీసం గ్రాము నుంచి కూడా కొనుగోలు చేయొచ్చు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa